‘కాంగ్రెస్‌… మావోయిస్టు పార్టీ కంటే దారుణం’

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో జ‌రిగిన బీజేపీ స‌భ‌లో కాంగ్రెస్ పార్టీని మావోయిస్టుల కంటే దారుణ‌మైన పార్టీగా అభివ‌ర్ణించారు. వాస్త‌వానికి ఆదివారం ఆయ‌న బెంగ‌ళూరులో ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా కాంగ్రెస్‌పార్టీపై విరుచుకుప‌డ్డారు. డీఎంకే పార్టీకి వెన్నుపోటు పొడిచిన పార్టీగా అభివర్ణించారు. తాజాగా సాయంత్రం సికింద్రాబాద్‌లో నిర్వ‌హించిన స‌భ‌లోనూ కాంగ్రెస్‌ను మ‌రింత ఎక్కువ‌గా ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాంగ్రెస్ వామపక్ష పార్టీల కంటే కూడా మరింత ‘వామపక్షంగా మారిందని అన్నారు. అంటే, కాంగ్రెస్ పార్టీ ఒక కఠోరమైన, వక్రీకరించబడిన మావోయిస్టు సంస్థగా తయారైంద‌ని ప్ర‌ధాని దుయ్య‌బ‌ట్టారు. అంతేకాదు.. మత ఛాందసవాదంలో ముస్లిం లీగ్‌ను సైతం అధిగమించి పోయింద‌న్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీనే ముస్లిం లీగ్‌గా రూపాంతరం చెందిందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనిఎంఎంసి` అని పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంఎంసి అంటే ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్…అని మోడీ కొత్త అర్థం చెప్పారు. ఇలాంటి పార్టీకి ప్ర‌జ‌లు ఎప్పుడో స‌మాధి క‌ట్టార‌ని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రుణం తీర్చుకోలేనిది!

తెలంగాణ ప్ర‌జ‌ల రుణం తీర్చుకోలేనిద‌ని ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించారు. దేశం మొత్తం మీద బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నప్పుడు, క‌మ‌లం పార్టీకి ఒక ఎంపీని అందించిన గడ్డ తెలంగాణ అని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఏమాత్రం మద్దతు లేనప్పుడు కూడా… బీజేపీకి తెలంగాణ మద్దతు లభించింద‌ని గుర్తు చేశారు. ఇప్పుడు ఇక్కడి ఎంపీలలో దాదాపు సగం మంది బీజేపీకి చెందినవారే ఉన్నార‌ని తెలిపారు. (మొత్తం 17 మంది ఎంపీలో 8 మంది బీజేపీ స‌భ్యులు). ‘వలీ బార్, ప్రచండ్ బహుమత్ సే, యహా భీ’ (మళ్ళీ వచ్చేసారి, ప్రచంచ‌ బహుమతి ల‌భిస్తుంది) అని వ్యాఖ్యానించారు.

మోడీ స‌ర్కార్ నినాదాల హోరు..

తెలంగాణ ప్రజలపైనా, రాష్ట్ర బీజేపీ కార్యకర్తలపైనా త‌న‌కు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. అయితే.. ఈ స‌మ‌యంలో స‌భ‌కు హాజ‌రైన జనసమూహం నుంచి మోడీ సర్కార్ అనే నానాదాలు వినిపించ‌డంతో ప్ర‌ధాని ఒక్క‌నిమిషం త‌న ప్ర‌సంగాన్ని నిలువ రించి.. వారి నినాదాల‌ను ఆస‌క్తిగా ఆల‌క‌రించారు. అనంత‌రం ఆయ‌న త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. ప్ర‌జ‌ల ఉత్సాహం చూస్తుంటే.. ఇక్క‌డ బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు ఖాయ‌మ‌ని అన్నారు. అంతేకాదు.. ఒకప్పుడు, దక్షిణం నుండి ఈశాన్యం వరకు, బీజేపీని ఒక అల్పసంఖ్యాక పార్టీగా(మైనారిటీ) పరిగణించేవారని అన్నారు. కానీ నేడు ఒక సిద్ధాంతం దేశానికి అంకితమైతే, దాని గర్జన ప్రతిధ్వనిని ఏ సరిహద్దులూ అడ్డుకోలేవని ప్రజల త‌మ తీర్పు ద్వారా చెబుతున్నార‌ని అన్నారు.