ర‌ఘురామ‌కు కోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌…

టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు త‌ల‌పెట్టి రామాయ‌ల‌ నిర్మాణానికి సంబంధించిన ఇక్క‌ట్లు దాదాపు తొలిగిపోయాయి. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఉండిలోని ఆకివీడు మండ‌లంలో ఉన్న పెద‌పేట‌లో పురాత‌న రామాల‌యాన్ని పున‌ర్నించేందుకు ర‌ఘురామ న‌డుం బిగించారు. అయితే.. ఈ ప్రాంతంలోని ఎస్సీలు దీనిని వ్య‌తిరేకించారు. ఇక్క‌డ తాము గొంతేన‌మ్మ ఆల‌యాన్ని నిర్మించుకున్నామ‌ని.. పూజ‌లు కూడా చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. అయితే.. అస‌లు క్రిస్టియానిటీ తీసుకున్న వారు ద‌ళితులు కారంటూ ర‌ఘురామ ప్ర‌త్యేక వాద‌న తెర‌మీదికి తీసుకురావ‌డం.. ప‌ట్టుద‌ల‌తో రామాల‌య నిర్మాణానికి పూనుకోవ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రెండు రోజుల కిందట స‌తీసమేతంగా ఆల‌య నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కూడా చేశారు. అయితే.. దీనిని వ్య‌తిరేకిస్తూ.. కొంద‌రు ఎస్సీ సంఘాల నాయ‌కులు, ఓ న్యాయ‌వాది కూడా హైకోర్టును ఆశ్ర‌యించారు.

దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు.. అస‌లు ఆ ప్రాంతంలో రామాల‌యంపై ఎప్ప‌టి నుంచో వివ‌ర‌ణ ఇవ్వాలంటూ.. అధికారుల‌ను ఆదేశించింది. దీంతో సంబంధిత రెవెన్యూ, పంచాయ‌తీ, ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ అధికారులు పెద‌పాడులో ఉన్న రామాల‌యం హిస్ట‌రీని త‌వ్వితీసి.. కాయితాలు, ఆధారాలు స‌హా.. తాజాగా మంగ‌ళ‌వారం కోర్టుకు స‌మ‌ర్పించారు. దీనిలో దాదాపు 80 ఏళ్ల కింద‌టే ఇక్క‌డ రామాల‌యం ఉంద‌ని.. అయితే, కాల‌గ‌తిలో అది జీవం కోల్పోయింద‌ని తెలిపారు.

ఈ ఆధారాల‌తో ఏకీభ‌వించిన హైకోర్టు.. ఇక్క‌డ రామాల‌యం నిర్మించుకునేందుకు అనుమ‌తి ఇస్తూ.. పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. పురాత‌న కాలం నుంచి రామాల‌యం ఉంద‌న్న ఆధారాలు త‌మ‌ను సంతృప్తి ప‌రిచాయ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. గొంతేన‌మ్మ అనే ఆల‌యం లేద‌ని.. గ్రామ దేవ‌త మాత్ర‌మేన‌ని అది కూడా.. 20 ఏళ్ల‌కు ముందే ఏర్పాటు కాలేద‌ని ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో రామాల‌య నిర్మాణానికి అనుమ‌తులు మంజూరు చేసింది. పోలీసులు త‌గిన భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆదేశించింది.