తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా ఇటీవల కాలంలో హోం శాఖ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. వివాదాల్లో కూడా చిక్కుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. స్టేషన్ కి వెళ్తే పనులు జరగడం లేదని పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు.. పోలీసుల నుంచి సరైన వర్కింగ్ నేచర్ కూడా కనిపించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి.
ఇవన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు కీలకంగా ఉంటుంది. అభివృద్ధి ఎంత ఉన్నప్పటికీ.. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ.. ప్రజలతో పోలీసులు వ్యవహరించే తీరు ప్రభుత్వానికి కీలకం. ఈ విషయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చాలా ముఖ్యం. కానీ తెలంగాణలో ఎటు చూసినా ఈ తరహా పరిస్థితి కనిపించడం లేదని ఇటీవల మానవ హక్కుల కమిషన్ కూడా ఆక్షేపించింది. తాజాగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక చిన్న కేసులో లిక్కర్ బాటిళ్లను లంచంగా కోరడం దుమారాన్ని రేకెత్తించింది.
సహజంగా ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వారి దగ్గర డబ్బులు తీసుకోవటమే నేరమైతే ఏకంగా రంగారెడ్డి జిల్లా మీర్ పేట ఎస్ఐ నాగభూషణం లిక్కర్ బాటిళ్లను లంచంగా అడగడం.. పోలీసుల వ్యవహార శైలిని మరింతగా విమర్శలకు గురి చేసింది. ఈ వ్యవహారం బయటికి వచ్చిన తర్వాత సదరు ఎస్ఐ నాగభూషణంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అది వేరే సంగతి. కానీ రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే కొనసాగుతోందన్న విమర్శల పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేయాలి.
ఇది మచ్చుకు వెలుగు చూసిన విషయం కాదు.. ఇప్పటికే వివాహేతర సంబంధాలు, గంజాయి తదితర కేసుల్లోనూ పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. వారిని సస్పెన్షన్ లో కూడా పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇక సాధారణ పౌరులు పోలీస్ స్టేషన్ కు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చగా మారే పరిస్థితి అన్నది గుర్తించాలి. ముఖ్యంగా ఈ శాఖను వేరే వారికి అప్పగించడమా లేకపోతే తరచుగా ముఖ్యమంత్రి దీనిపై సమీక్ష చేయటమా అనేది చూడాలి.
లేకపోతే ప్రభుత్వం ఎంత మంచి పని చేసినప్పటికీ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ప్రయోజనం అయితే కనిపించకపోవచ్చు అని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతున్న మాట వాస్తవమని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates