40 కోట్ల స్కాం… రోజా ‘ఆట’కట్టు?

‘‘ఆడుదాం ఆంధ్రా’’ అంటూ వైసీపీ హయాంలో ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆటల పేరుతో మాజీ మంత్రి రోజా, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఆడుదాం ఆంధ్రా అంటూ వారిద్దరూ దాదాపు 40 కోట్ల రూపాయల స్కామ్ కు తెరతీశారని ఆరోపణలు రావడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే రోజా, బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డిలపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తాజాగా ప్రభుత్వానికి సమర్పించిన 3 వేల పేజీల నివేదికలో షాకింగ్ విషయాలు ఉన్నాయని తెలుస్తోంది. రూ. 40 కోట్ల అంచనాతో మొదలైన ఆ ఈవెంట్ కోసం దాదాపు రూ.125 కోట్లు ఖర్చుపెట్టినట్లు వైసీపీ ప్రభుత్వం లెక్కలు చూపిందని తెలుస్తోంది.

అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 600కు పైగా ప్రాంతాల్లో విచారణ చేసిన విజిలెన్స్ అధికారులు దాదాపు రూ. 40 కోట్లు దుర్వినియోగమైనట్లు గుర్తించారని తెలుస్తోంది. ఆ ప్రకారం పక్కా ఆధారాలతో ప్రభుత్వానికి నివేదికను అధికారులు సమర్పించారట.

ఆ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి ఏసీబీ లేదా సీఐడీకి అప్పగించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి స్పందించారు. వైసీపీ నేతలు ఆడుదాం ఆంధ్రా పేరుతో పేద క్రీడాకారుల పొట్టకొట్టారని ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారెవరైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఏది ఏమైనా ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ అప్పట్లో ఉత్సాహంగా తొడగొట్టి, కూత పెట్టి కబడ్డీ ఆడిన రోజా ఆటకట్టించేందుకు చంద్రబాబు సర్కార్ రెడీ అయినట్లు కనిపిస్తోంది.