పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు అంత‌ర్గ‌త అవ‌య‌వాలు దెబ్బ‌తిన్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో పోలీసుల‌పై కేసు న‌మోదు చేయ‌డంతోపాటు త‌నకు న్యాయం చేసేలా.. ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరుతూ ఆయ‌న తాజాగా పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు.. పోలీసులు స‌హా ప్ర‌భుత్వం నుంచి వివ‌ర‌ణ కోరింది. ఈ క్ర‌మంలో అఫిడ‌విట్ల‌ను దాఖ‌లు చేయాల‌ని ఆదేశిస్తూ.. విచార‌ణ‌కు వాయిదా వేసింది.

ఏం జ‌రిగింది?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో న‌కిలీ నెయ్యి వినియోగించిన వ్య‌వ‌హారంపై రెండు నెల‌ల కింద‌ట ఏపీలో అధికార కూట‌మి, ప్ర‌తిప‌క్ష‌(ప్ర‌ధాన కాదు) వైసీపీ నాయ‌కుల‌కు మ‌ధ్య మాటల యుద్ధం జ‌రిగింది. ముఖ్యంగా ఈ కేసును విచారించిన సీబీఐ నేతృత్వంలోని సిట్ త‌న నివేదిక‌నునెల్లూరు కోర్టుకు స‌మ‌ర్పించింది. దీనిలోని కొన్ని భాగాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీనిలో క‌ల్తీ జ‌రిగింద‌ని..పాలు లేకుండానే నెయ్యిని ఉత్ప‌త్తి చేశార‌ని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు.. సీఎం చంద్ర‌బాబు.. మ‌రుగు దొడ్ల‌ను శుబ్ర‌ప‌రిచేందుకు వినియోగించే కెమిక‌ల్స్‌ను కూడా వాడార‌ని తెలిపారు.

ఈ వ్య‌వ‌హారంపై రాష్ట్ర వ్యాప్తంగా కొంద‌రు పోస్ట‌ర్లు అంటించారు. దీనిలో వైసీపీ హ‌యాంలో తిరుమల ప‌విత్ర‌త భ‌గ్న‌మైంద‌ని పేర్కొన్నారు. ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యితోపాటు బాత్రూమ్‌ల‌లో వినియోగించే ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాల‌ను కూడా వాడారని పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి, జ‌గ‌న్ ఫొటోల‌ను ప్ర‌ముఖంగా ప్ర‌చురించారు. దీంతో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. ఈ ప‌రిణామాల క్ర‌మంలో పోస్ట‌ర్ల‌కు వ్య‌తిరేకంగా వైసీపీ ఉద్య‌మించింది. అదేస‌మ‌యంలో రాష్ట్రంలోని ప‌లు శ్రీవారి ఆల‌యాల్లో చంద్ర‌బాబుకు మంచి బుద్ధి క‌లిగించాల‌ని కోరుతూ.. పూజ‌లుచేశారు.

ఇలా ఓ ఆల‌యంలో పూజ‌లు చేయించి వ‌స్తున్న అంబ‌టిని కొంద‌రు దారిలో అడ్డుకున్నారు. ఇది వివాదంగా మారి.. ఆయ‌న సీఎం చంద్ర‌బాబుపై దుర్భాష‌లాడారు. దీంతో టీడీపీ నేత‌లు, కూట‌మి కార్య‌క‌ర్త‌లు క‌లిసి.. అంబ‌టి నివాసం వ‌ద్ద‌.. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే అంబ‌టిని గుంటూరు జిల్లా న‌ల్ల‌పాడు పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు పంపించారు.

అయితే.. అరెస్టు అనంత‌రం.. త‌న‌ను స్టేష‌న్‌లో రాత్రిపూట శారీర‌కంగా హింసించార‌ని.. నేల‌పై కూర్చోపెట్టి రెండు కాళ్లు ఎడం చేశార‌ని.. బెయిల్‌పై విడుద‌లైన త‌ర్వాత‌ ప‌లు సంద‌ర్భాల్లో అంబ‌టి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే వ్య‌వ‌హారంపై ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌ను నాడు హింసించిన పోలీసుల‌పై కేసున‌మోదు చేయ‌డంతోపాటు.. త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరారు.