విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలకు సంబంధించి తాజాగా హైకోర్టు పూర్తి స్పష్టత ఇచ్చింది. ధార్మిక పరిషత్.. శృంగేరి శారదా పీఠం మార్గదర్శకాల్ని దేవాదాయ శాఖ కూడా సర్క్యులర్ జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలేం జరిగిందంటే..
ఫారిన్ ట్రిప్ లకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల్లోని ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు చేయకూడదన్న మార్గదర్శకాల్ని ధార్మిక పరిషత్, శృంగేరి శారదా పీఠం జారీ చేయగా.. దీనికి దేవాదాయ శాఖ అమలుకు ఓకే చెప్పింది. ఇదే అంశాన్ని ఏపీ హైకోర్టు కూడా బలపర్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. ఈ మార్గదర్శకాల్ని అమలు చేయటం లేదని పేర్కొంటూ విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయదారు సుబ్రహ్మణ్యం సోమయాజి కేసు దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఏపీ హైకోర్టులో జరిగిన వాదనల్లో పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. విదేశీ ప్రయాణాలు చేసిన అర్చకులను నిబంధనలకు విరుద్ధంగా దేవస్థానాల్లోని ప్రధాన గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అమనుతి ఇస్తున్నారని పేర్కొన్నారు. ధార్మిక పరిషత్.. శృంగేరి శారదా పీఠం ప్రామాణిక ప్రకారం అర్చకులకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఒకవేళ ఎవరైనా వెళ్లాల్సిందేనని పట్టుబడితే అనుమతి ఇవ్వొచ్చని.. కాకుంటే వారు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆలయంలోని గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు చేసే అవకాశం ఉండదు. ఆలయం బయట జరిగే పూజలు.. వ్రతాలకు అనుమతి ఉంటుంది.
విదేశాలకు వెళ్లిన వారు సంప్రదాయానికి విరుద్ధంగా ముఖ క్షవరం.. జుట్టు కత్తిరించుకున్న వారు గర్భాలయంలో పూజలు చేసేందుకు వీల్లేదని ప్రామాణిక చెబుతుందని పేర్కొన్నారు. దీనిపై దేవాదాయశాఖ తరపు న్యాయవాది స్పందిస్తూ.. సర్క్యులర్ ను.. ప్రామాణికలను ఫాలో అవుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు సైతం ఈ వాదనకు ఓకే చెప్పి.. నిబంధనల్ని అమలు చేయాలని పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates