కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి… ఏం జరిగింది?

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయి. సిద్ధిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి నేతృత్వంలో  భారీ సంఖ్యలో గజ్వేల్ కు తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు… కేసీఆర్ క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లాయి. ఈ దాడిలో కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించివేశారు.

ఈ దాడి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను కేసీఆర్ కార్యాలయం గోడకు అతికించారు. దాడికి వచ్చేటప్పుడే రేవంత్ రెడ్డి ఫొటోను కాంగ్రెస్ శ్రేణులు తమ వెంట తెచ్చుకున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ కార్యాలయంలో జై కాంగ్రెస్ అన్న నినాదాలతో పాటుగా గజ్వేల్ టైగర్ నర్సిరెడ్డి అన్న నినాదాలు హోరెత్తాయి. అదే సమంలో బీఆర్ఎస్, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ఆ శ్రేణులు నినాదాలు చేశాయి.

గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తూ గెలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో కేసీఆర్ తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ కార్యాలయానికి ఆయన పెద్దగా రాలేదనే చెప్పాలి. సీఎంగా ఉన్న సమయంలో రాకున్నా పెద్దగా పట్టింపు లేదు గానీ, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా క్యాంపు కార్యాలయానికి రాకుంటే ఎలా అంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే వాదన వినిపించేలా గజ్వేల్ కు రాని కేసీఆర్ కు క్యాంపు కార్యాలయం ఎందుకు? ఆయనను ఇక్కడి నుంచి గెలిపించడం ఎందుకు? అంటూ ఆంక్ష రెడ్డి పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ఈ దాడి గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రౌడీ రాజ్యం నడుస్తోందని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడి జరుగుతుంటే.,.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటో ఇట్టే తేలిపోతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి జరుగుతంటే చోద్యం చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.