38 ఎంపీ స్థానాలు: ఎవరికీ కలిసొస్తాయి?

ఏపీలో ప్రస్తుతం ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలు 25. అయితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అవి మరో 13కు పెరిగి 38 వరకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇది ఏ పార్టీకి మేలు చేస్తుంది? ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది? అనేది ఆసక్తిగా మారింది. పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీకి బలం ఉంది. అయితే గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ గెలుపు సాధించింది. వైసీపీ నాలుగు స్థానాలు దక్కించుకుంది.

అయితే గతానికి సంబంధం లేకుండా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, మచిలీపట్నం, కడప, రాజంపేట, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు స్థానాల్లో పూర్తిగా మార్పు రానుంది. విస్తారమైన నియోజకవర్గాలు కావడంతో పాటు జనాభా పరంగా కూడా ఇవి పెద్దవిగా ఉన్నాయి. దీంతో వాటిలో విభజన ఖాయం అన్న చర్చ జరుగుతోంది. ఇవి స్థానిక నాయకులతో పాటు పార్టీలకు కూడా కీలకంగా మారాయి.

శ్రీకాకుళం విస్తారంగా ఉన్న నియోజకవర్గం. మొత్తం జిల్లాకు ఇదొక్క నియోజకవర్గమే ఉంది. దీంతో ఇక్కడ రెండు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే జిల్లాలో టీడీపీకి ఉన్న బలం, నాయకుల సంఖ్యతో పోల్చుకుంటే విభజన జరిగినప్పటికీ అది పార్టీకి మేలు చేస్తుందని నాయకులు చెబుతున్నారు.

ఇక తిరుపతి నియోజకవర్గం ఎస్సీ. కానీ దీనిని విడదీసి చిత్తూరులోని కొన్ని మండలాలను కలిపి తిరుపతిని జనరల్ చేయనున్నట్టు సమాచారం. ప్రత్యామ్నాయంగా మరో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసి దానిని ఎస్సీ నియోజకవర్గంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో ఆసక్తికర పరిస్థితి కనిపించింది. వైసీపీ ఎంపీ స్థానం గెలుచుకోగా, పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలను జనసేన, టీడీపీలు గెలిచాయి.

ఇక మచిలీపట్నంలోని కొన్ని మండలాలను విడదీసి ఇక్కడ కూడా మరో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అలాగే రాజంపేట, కడపలలోనూ మార్పులు తప్పవని చెబుతున్నారు. దీంతో ఆయా పార్టీలకు ఉన్న బలాబలాలు, నాయకుల ఆధిపత్యం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి.