కాంగ్రెస్ నాయకులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి

రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో విపక్ష నాయ‌కుడు రాహుల్‌గాంధీ కీల‌క సూచన‌లు చేశారు. ఇగోల‌ను ప‌క్క‌న పెట్టి పార్టీ కోసం ప‌నిచేయాల‌ని సూచించారు. ఇగోల కంటే కూడా పార్టీనే ముఖ్య‌మని తేల్చి చెప్పారు. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంయుక్తంగా పార్టీ కోసం ప‌నిచేయాల‌న్నారు. ఒక్కొక్క జిల్లా క‌మిటీ అధ్య‌క్షుడికీ పార్టీపై ప‌ట్టు అవ‌స‌ర‌మ‌ని, ఆదిశ‌గా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని సూచించారు. ప్ర‌తి జిల్లాలోనూ డీసీసీ స్థాయిలో ప‌ది మందినైనా త‌యారు చేయాల‌ని పేర్కొన్నారు. తాజాగా వికారాబాద్‌లోని అనంత‌గిరిలో జ‌రిగిన డీసీసీల శిక్ష‌ణ త‌ర‌గ‌తిలో రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌ధాని ప‌ద‌విపై..

ప్ర‌ధాన మంత్రిప‌ద‌విని తీసుకునేందుకు తాను రెడీగానే ఉన్నాన‌ని రాహుల్ చెప్పారు. ప్ర‌స్తుతందేశం క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉందన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ అమెరికా చేతిలో కీలు బొమ్మ‌గా మారుతున్నార‌ని చెప్పారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం రైతుల పాలిట శాపంగా మారనుంద‌ని హెచ్చ‌రించారు. ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌న‌తోనూ ప్ర‌ధాని మోడీ సాధించింది ఏమీ లేద‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోంద‌ని.. దీనిని ప‌రిష్క‌రించేందుకు కేంద్రం ప్ర‌య‌త్నించ‌డం లేద‌న్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని ప‌ద‌వి ద‌క్కితేనే దేశం బాగుప‌డుతుంద‌న్నారు. అయితే.. త‌న‌కు ఈ ప‌ద‌విపై వ్యామోహం లేద‌న్నారు.

మార్ష‌ల్ ఆర్ట్స్ అవ‌స‌రం!

కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు మార్ష‌ల్ ఆర్ట్స్ అవ‌స‌ర‌మ‌ని రాహుల్ గాంధీ అన్నారు. అనంత‌గిరిలో పార్టీ నాయ‌కులకు శిక్ష‌ణ ఇస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న మార్ష‌ల్ ఆర్ట్స్ చేసి చూపించారు. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ డీసీసీ అధ్యక్షులకు క్లాస్ చెప్పారు.` జియు జిట్సు` అనే మార్షల్ ఆర్ట్‌లో మెళకువలను ఆయ‌న వివ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. `మార్షల్ ఆర్ట్స్‌`ను వ్యక్తిగత జీవితంలో ఒక భాగం చేసుకోవాల‌ని సూచించారు. అదేవిధంగా `కాంగ్రెస్ ఐడియాలజీ`ని రాహుల్ వివ‌రించారు. ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జ‌ల చేత ఏర్ప‌డిన ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌, రాజ్యాంగం ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప‌నిచేస్తుంద‌న్నారు.