వైసీపీ అధినేత జగన్ వెనుక ఉండే కార్యకర్తలు, యువత అంతా `జెన్జీ` అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ పర్యటనలకు తరలి వస్తున్న యువతంతా జెన్జీనేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు స్పందించారు. మంత్రి వర్గ సమావేశంలో పలువురు మంత్రులు ఈ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు. జగన్ వెంట వస్తున్న వారంతా జెన్జీ అంటూ.. వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
దీనిపై ఒక్క నవ్వునవ్విన చంద్రబాబు.. అది జెన్జీ కాదు.. `గంజాయి జీ` అని కొత్త పేరు పెట్టారు. జగన్ వెంట, వైసీపీ నాయకుల వెంట ఉండే బ్యాచ్ అంతా గంజాయి బ్యాచేనని.. అది గంజాయి జీనేనని చెప్పుకొచ్చారు. దీంతో మంత్రులు సైతం ఘొల్లున నవ్వేశారు. వైసీపీ హయాంలో యువత పూర్తిగా గాడి తప్పిందని అన్నారు. గంజాయి, మాదకద్రవ్యాలు, మద్యానికి అలవాటు పడ్డారని, కుటుంబాలు సైతం విచ్ఛిన్నం అయ్యాయని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమించుకుని యువత లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పాఠశాలలకు వెళ్లి ఆయన యువతను సన్మార్గంలో నడిపించేందుకు.. తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఎలా మెలగాలో బోధిస్తున్నారని అన్నారు. ఆయన ప్రవచనాలను పుస్తకాల రూపంలో తీసుకువస్తున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో చాగంటి ప్రవచనాలను పాఠశాలల నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు విస్తరించే ప్రణాళిక ఉందన్నారు.
ఇలాంటి మంచి కార్యక్రమం ఒక్కటైనా వైసీపీ పాలనలో జరిగిందా? అని మంత్రులను చంద్రబాబు ప్రశ్నించారు. వారు లేదని సమాధానం ఇచ్చారు. దీంతో ఈ విషయాన్ని కూడా తల్లిదండ్రులకు వివరించాలని ఆ బాధ్యతను కూడా మంత్రులు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్కరికీ అండగా కూటమి ప్రభుత్వం ఉంటే.. ప్రతి ఒక్కరినీ ఎలా నాశనం చేయాలన్న విషయంపై వైసీపీ నేతలు ఆలోచన చేస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గొడ్డలి పార్టీ నేతల వెంట వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates