ఎన్నిక‌ల వేళ‌… ఇన్‌ఫ్లుయెన్స‌ర్లదే `రాజ‌కీయం`!

ప‌దిమందిని మెప్పించ‌గ‌ల మాట నేర్పు ఉందా? సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌జ‌లను ఆక‌ర్షించ‌గ‌ల నైపుణ్యం ఉందా? అయితే.. రాజకీయాల‌న్నీ మీవే!. త్వ‌ర‌లోనే.. దేశ‌వ్యాప్తంగా కీల‌క‌మైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో బ‌ల‌మైన పోటీ ప‌డుతున్న ప్ర‌ధాన పార్టీలు ప్ర‌జ‌లను ఆక‌ర్షించేందుకు ర‌క‌ర‌కాల మార్గాల‌ను అన్వేషిస్తున్నాయి.

వీటిలో ప్ర‌ధానంగా సోషల్ మీడియాలో ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల కోసం.. పార్టీలు క్యూ క‌డుతున్నాయి. వీరి ద్వారా ప్ర‌చారం చేయిస్తే.. త‌మ అభ్య‌ర్థులు గెలుపు గుర్రం ఎక్క‌డం.. ఈజీ అవుతుంద‌ని, త‌మ పార్టీ అధికారంలోకి రావ‌డం మ‌రింత తేలిక అవుతుంద‌ని భావిస్తున్నారు. ఈ నేప థ్యంలో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసుకునేందుకు ఇన్‌ఫ్లెయెన్స‌ర్ల కోసం పార్టీల వేట కొన‌సాగుతోంది.

ప‌శ్చిమ బెంగాల్‌,త‌మిళ‌నాడు, అస్సాం, పుదుచ్చేరి, కేర‌ళ రాష్ట్రాల్లో వ‌చ్చే ఏప్రిల్‌లో ఎన్నిక‌లు జ‌రగనున్నాయి. వీటిలోనూ ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాలు బీజేపీ స‌హా.. ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీల‌కు కీల‌కంగా మారాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు త‌మ‌కు ఉన్న అన్ని మార్గాల ద్వారా ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ప్ర‌ధానంగా సోషల్ మీడియా అయితే.. ప్రతి ఒక్క‌రికీ చేరుతుంద‌ని భావిస్తున్న పార్టీలు.. ఆదిశ‌గా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తున్నాయి.

రీల్ లేదా 2 నిమిషాల నిడివి ఉన్న వీడియోలు చేసి.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే వారికి మంచి మంచి ప్యాకేజీల‌ను కూడా పార్టీలు అందిస్తున్నాయి. అయితే.. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారంపై ఎన్నిక‌ల సంఘం దృష్టి సారించ‌క‌ముందే.. ఈ పనిని పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో సాధ్య‌మైనంత వేగంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నున్నాయి. ప్ర‌ధానంగా ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నా డు రాష్ట్రాలు ఈ విష‌యంలో ముందున్నాయి.