ఏపీ ప్రభుత్వానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డెడ్ లైన్ కూడా పెట్టింది.

అయితే, ఆ కమిషన్ ఏర్పాటుపై మాజీ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్య స్వామికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఆ పిటిషన్ ను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కొట్టివేసింది. దీంతో, ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కేసులో ఏపీ ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆ ప్రత్యేక కమిటీ ఓవర్‌లాపింగ్‌ కిందికి రాదని క్లారిటీనిచ్చింది.

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీని నియమించడం ఏంటని సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసి పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది.

మరోవైపు, లడ్డూ వ్యవహారంపై అసెంబ్లీతోపాటు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూడా చర్చించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం నాడు శాసన సభలో ఈ విషయంపై చర్చ జరిగే అవకాశముంది.

అయితే, ఆ చర్చకు వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ కూడా హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, మండలిలో సైతం లడ్డూ ఇష్యూపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్ సూచించారట.