`కోవా బ‌న్‌` వివాదం.. నాగబాబు ఎంట్రీ..!

గ‌త వారం ప‌ది రోజులుగా తెర‌చాటునే ఉన్న `కోవా బ‌న్‌` వివాదం.. రెండురోజుల నుంచి తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ రంగు పులుముకుంది. ఈ వివాదం స‌రికాదంటూ.. జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్సీ నాగ‌బాబు, టీడీపీ త‌ర‌ఫున మంత్రి నారా లోకేష్‌లు స్పందించారు. నాగ‌బాబు అయితే.. ఏకంగా బాధిత కుటుంబాన్ని త‌న నివాసానికి పిలిచి ఊర‌డించారు. రెక్క‌డితే కానీ.. డొక్కాడ‌ని కుటుంబాల‌ను.. చిరు వ్యాపారుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వేధించ‌డం స‌రికాద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. బాధిత కుటుంబానికి తాము అండ‌గా నిలుస్తామ‌న్నారు. దీంతో స‌ద‌రు కుటుంబం సంతోషం వ్య‌క్తం చేసింది.

అస‌లేంటిది?

కోవా-బ‌న్‌.. ఓ చిరు తిండి. 10 రూపాయ‌ల‌కే చిన్న పాటి బ‌న్‌లో మ‌ధ్య‌లో కోవాలాంటి స్వీట్ ప‌దార్థాన్ని ఉంచి విక్ర‌యిస్తారు. ఇది ఏపీలోని సీమ ప్రాంతం స‌హా.. గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని కొన్ని కుటుంబాల‌కు చిరు వ్యాపారం. వీరు మొబైల్ వాహ‌నాల్లో బ‌న్నులు తీసుకువ‌చ్చి.. అక్కడిక‌క్క‌డే వాటిలో కోవాను పెట్టి విక్ర‌యిస్తారు. ఇవి.. చాలా స్వీట్‌గా ఉండ‌డంతోపాటు రుచికరంగా కూడా ఉంటాయి. దీంతో చిన్న పిల్ల‌లు చాలా ఇష్టంగా తింటారు. ఇక‌, ఈ చిరు వ్యాపారులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్క‌డ తిరునాళ్లు, జాత‌ర‌లు జ‌రిగినా.. అక్క‌డికి వెళ్లి వ్యాపారాలు చేసుకుంటారు.

ఇలానే గ‌త నెల‌లో తెలంగాణలో జ‌రిగిన స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌ర‌కు క‌ర్నూలు జిల్లాకు చెందిన వ‌లీ కుటుంబం వెళ్లి.. వ్యాపారం చేసుకుంది. అయితే.. కొంద‌రు ప్రైవేటు ఛానెళ్ల విలేక‌రులు.. కోవా-బ‌న్సుపై ఆరోప‌ణ‌లు చేయ‌డంతోపాటు.. ఇది అనారోగ్యానికి దారి తీస్తుంద‌ని.. పేర్కొంటూ.. పెద్ద ఎత్తున హ‌డావుడి చేశారు. అంతేకాదు.. కోవాలో కోవాను చూపించాలని ర‌చ్చ చేశారు. వారితోనే బ‌న్నులు తినిపించి.. అవ‌మాన‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని బాధితులు తెలిపారు.

దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. మ‌రోవైపు.. స్థానిక ఓ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు.. బ‌న్ను వ్యాపారి కుటుంబంపై దాడి చేసి కొట్టి.. 10 వేల రూపాయ‌ల విలువైన‌ బ‌న్నుల‌ను కాల్వ‌లో పోశారు. వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై గ‌త వారం ప‌ది రోజులుగా సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. చిరు వ్యాపారిపై ఇంత ప్ర‌తాపం ఎందుక‌ని నెటిజ‌న్లు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొంతమంది ఈ వివాదానికి మతం రంగు కూడా పూసి అనైతిక ప్రచారాలు చేశారు. ఈ క్ర‌మంలో తాజాగా మంత్రి లోకేష్ బాధిత కుటుంబానికి ఫోన్ చేయ‌గా.. నాగ‌బాబు వ‌లీని త‌న నివాసానికి పిలిచి ఓదార్చారు.