మాజీ ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన “ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ” పుస్తకం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో చైనాతో యుద్దం వేళ ప్రత్యర్థి సైనికులు, యుద్ధ ట్యాంకులు భారత సరిహద్దుల వరకూ వచ్చిన విషయాన్ని తాను కేంద్రానికి చెప్పినా స్పందించలేదని నరవణే ఆ పుస్తకంలో ప్రస్తావించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఆ తర్వాత ఆర్మీ ఈ పుస్తకం రిలీజ్ కు అనుమతి ఇవ్వలేదని, ఆ పుస్తకాన్ని పార్లమెంట్ లో రాహుల్ ప్రస్తావించడం ఏంటని రాహుల్ ను బీజేపీ అడ్డుకుంది. ఇక, ఆ పుస్తకం తెస్తానని రాహుల్ ప్రకటించిన రోజే ప్రధాని మోదీ సభకు గైర్హాజరయ్యారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
అంతేకాదు, మోదీపై మహిళా ఎంపీల దాడి యత్నం అంటూ అసత్య ఆరోపణలు చేసి మోదీని కాపాడే ప్రయత్నం చేశారని బీజేపీపై మండిపడుతోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలుపకుండానే ఆ తంతు పూర్తయిందని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ పుస్తకం ప్రచురణ హక్కులు పొందిన పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా స్పందించింది. తాము ప్రచురించని పుస్తకంలో అంశాల్ని ఎవరైనా బయటపెడితే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ క్రమంలోనే రాహుల్ పై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. అయితే, ఆ పుస్తకం 2023లోనే ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని నరవణే పెట్టిన ట్వీట్ ను రాహుల్ బయటపెట్టారు.
ఈ క్రమంలోనే నేడు పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ మరోసారి ఈ పుస్తకం వివాదంపై స్పందించారు. పెంగ్విన్, నరవణేల్లో ఎవరు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. నరవణేను నమ్ముతారా పెంగ్విన్ ను నమ్ముతారా అని ప్రశ్నించారు. నరవణే అబద్ధం చెప్పరని రాహుల్ గాంధీ ఆయనకు మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ పుస్తకంతో మోదీని రాహుల్ ఇరుకున పడేశారని చెప్పవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates