తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు కోర్టుకు స‌మ‌ర్పించింది. అయితే.. ఈ నివేదిక‌లో ప‌లు విష‌యాల‌ను విస్మ‌రించార‌న్న‌ది కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అస‌లు దోషుల‌ను విస్మ‌రించార‌ని.. కేవ‌లం అధికారుల‌పైనే నివేదిక ఆరోప‌ణ‌లు చేసింద‌ని సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు దోషుల వ్య‌వ‌హారాన్ని కూడా తేల్చి తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల్సి ఉంద‌ని ఆయ‌న చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఏక స‌భ్య క‌మిష‌న్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. తాజాగా జ‌రిగిన కూటమి నేత‌ల కీల‌క స‌మావేశంలో దీనిపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అనంత‌రం.. ఈ వ్య‌వ‌హారంపై ప‌లు విషయాల‌ను సీఎం చంద్ర‌బాబుతో పంచుకున్నారు. దీనిలో ప్ర‌ధానంగా ఏక‌స‌భ్య క‌మిష‌న్ వైపు ప్ర‌భుత్వం మొగ్గు చూపుతోంది. ఇక‌, ఈ క‌మిష‌న్ ద్వారా వాస్త‌వాల‌ను మ‌రింత లోతుగా విచారించ‌నున్నారు. త‌ద్వారా దోషుల‌ను తేల్చ‌నున్నారు. ఎంత‌టివారినైనా చ‌ట్టం ముందు నిల‌బెట్ట‌నున్నారు.

ఇవీ తేలే విష‌యాలు..

+ 2022లోనే క‌ల్తీ నెయ్యిపై సీఎఫ్టీఆర్ఐ  నివేదిక వ‌చ్చినా.. ఎందుకు తొక్కి పెట్టారు?
+ ఎవరి ఆదేశాల‌తో ఆనాడు నివేదిక‌ను విస్మ‌రించారు.
+ నెయ్యి ద్వారా చేతులు మారిన సొమ్ము ఎంత‌?
+ నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిసింది ఎంత‌?  ఏమేర‌కు క‌ల్తీ చేశారు?
+ వైసీపీ హ‌యాంలో ఎన్నాళ్లు ఇలా జ‌రిగింది?  దీని వెనుక ఎవ‌రి పాత్ర ఏంటి?
+ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌ను మ‌రింత కూలంక‌షంగా విచార‌ణ చేయ‌నున్నారు.
+ ఎన్‌డీడీబీ(నేష‌న‌ల్ డెయిరీ డెవ‌ల‌ప్‌మెంటు బోర్డు) నివేదికలో వెల్ల‌డించిన వాస్త‌వాల‌పై మ‌రింత అధ్య‌య‌నం.
+  దోషులు ఎంత‌టి వారైనా వారిని చ‌ట్టం ముందు నిల‌బెట్ట‌డం.