దేశ చ‌రిత్ర‌లో.. `మ‌మ‌త` గెలిచారు… మరి ఈసీ మాటేంటి?!

సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచార‌ణ‌కు వ‌స్తాయి. న్యాయ‌శాస్త్రంలో ల‌బ్ధ‌ప్ర‌తిష్టులైన అనేక మంది న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తారు. ఇది కామ‌న్‌. కానీ, బుధ‌వారం అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్వ‌యంగా కోర్టుకు హాజ‌రు కావ‌డం.. బ‌లంగా త‌న వాద‌న‌లు విన్న‌వించ‌డం.. దీనిని ప్ర‌త్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది సుప్రీకోర్టుకు హాజ‌రుకావ‌డం.. చివ‌ర‌కు గేట్ల‌ను మూసివేయ‌డం వంటివి దేశం మొత్తాన్నీ విస్మ‌యానికి గురి చేశారు.

ఆ ముఖ్య‌మంత్రే ప‌శ్చిమ బెంగాల్ నాయ‌కురాలు, టీఎంసీ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ. ప్ర‌స్తుత ఎన్నిక‌ల సీజ‌న్‌లో ఒక్క క్ష‌ణం కూడా ఖాళీలేని షెడ్యూల్ ఉన్న మ‌మ‌త‌.. ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 4 వ‌ర‌కు సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌లోనే ఉన్నారు.

ఆసాంతం.. ఉద్విగ్నంగానే క‌నిపించారు. ఆమె ఆరోప‌ణ‌లు స‌హేతుకం. ఆమె వాద‌న ప‌టుత్వం.. అంటూ.. సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాదులు సైతం స‌మ‌ర్థించారంటే.. మ‌మ‌త‌లో ఆక్రోశం.. వాద‌న‌ల రూపంలో ఎలా క‌ట్ట‌లు తెంచుకుందో అర్ధం అవుతుంది.

“ఐదు నిమిషాలు అయినా.. నా వాద‌న‌లు వినండి మైలార్డ్‌“ అంటూ.. మ‌మ‌త చేసిన విన్న‌పానికి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం చ‌లించిపోయింది. “5 కాదు.. 15 నిమిషాలు తీసుకోండి. మీ వాద‌న‌లు సంపూర్ణంగా వినేందుకు మేం సిద్ధంగా ఉన్నాం“ అని చీఫ్ జ‌స్టిస్ స్వ‌యంగా చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇలా.. దేశ చ‌రిత్ర‌లో ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్వ‌యంగా సుప్రీంకోర్టుకు వెళ్ల‌డం వాద‌న‌లు వినిపించ‌డం ఇదే తొలిసారి కావ‌డం.. విశేషం!.

ఎందుకు వెళ్లారు?

మ‌రో మూడు మాసాల్లో ప‌శ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. అయితే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. హ‌డావుడిగా ఈ రాష్ట్రంలో ప్ర‌త్యేక ఇంటెన్సివ్ రివిజ‌న్‌(స‌ర్‌) పేరుతో ఓట‌ర్ల జాబితాల‌ను మార్చుతోంది. పేరులో అక్షరం త‌ప్పుగా ఉంద‌ని.. ఇంటి అడ్ర‌స్‌స‌రిగా లేద‌ని.. ఇల్లు మారార‌ని.. ఆడ‌పిల్ల‌ల‌కు పెళ్లి అయింద‌ని.. ఇలా.. అనేక కార‌ణాల‌ను చూపిస్తూ.. ఇప్ప‌టికి 1.5 కోట్ల మంది ఓట‌ర్ల‌ను జాబితాల నుంచి తొల‌గించింది. మ‌రో 2 కోట్ల మంది ఓట‌ర్ల ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న ప‌శ్చిమ బెంగాల్‌లో ఇదొక వ్యూహాత్మ‌క రాజ‌కీయ విన్యాసంగా రాష్ట్రంతోపాటు .. ఢిల్లీలోనూ చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి వ‌చ్చితీరుతామ‌ని.. బీజేపీ అగ్ర‌నేత‌ల ప్ర‌క‌ట‌న‌లు.. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. ఓటు తొల‌గిస్తామ‌న్న ఈసీ ప్ర‌కంప‌న‌లు వెర‌సి.. రాష్ట్రంలో స‌ర్ ప్ర‌క్రియ ఒక పెద్ద గంద‌ర‌గోళ వ్య‌వ‌స్థ‌గా మారిపోయింది. ఈ క్ర‌మంలో అనేక మార్లు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖలు సంధించారు. అయినా.. ఈసీ నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే సుప్రీంకోర్టుకు గోడు వెళ్ల‌బోసుకునేందుకు స్వ‌యంగా మ‌మ‌తా బెన‌ర్జీ సుప్రీంకోర్టుకు వ‌చ్చారు. త‌న‌దైన శైలిలో ఆమె వాద‌న‌లు వినిపించారు.

ఒక‌ర‌కంగా ఆమె త‌న రాష్ట్ర ఆవేద‌న‌ను.. ఈసీ అవ‌లంభిస్తున్న తీరును దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం దృష్టికి తీసుకురావ‌డంలో విజ‌య‌వంతం అయ్యారు. ఇక‌, ఇప్పుడు తేలాల్సింది.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం పాత్ర‌!. మ‌రి ఈ విష‌యంలో ఎన్నిక‌ల సంఘం గెలుస్తుందా?  లేదా? అనేది ఈ నెల 9న సుప్రీంకోర్టు వేదిక‌గా తేలిపోతుంది.