లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన సంగతి తెలిసిందే. సిట్ నివేదికలోని అంశాలపై టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. అయితే, సిట్ నివేదికలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయని ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. నెయ్యి వివాదంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా టెండర్‌ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు.

లడ్డు తయారీ కోసం 58 లక్షల లీటర్ల పామాయిల్, కెమికల్స్‌, ఇతర ఫ్లేవర్స్‌ కొనుగోలు చేశారని నివేదికలో వెల్లడైందని వివరించారు. వైసీపీ నేతలు కల్తీని సహజం అంటున్నారని, శ్రీవారి విషయంలో అపచారం జరుగుతోందని తెలిసి కూడా మౌనంగా ఎందుకు ఉన్నారో తేలాలని చెప్పారు.

ఆ నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలున్నాయని సీఎం చంద్రబాబు చెప్పడంతో ఈ విషయంపై చర్చ మొదలైందని గుర్తు చేశారు. అయితే, ఆ విషయం చంద్రబాబు స్వయంగా చెప్పింది కాదని, ఎన్‌డీటీబీ రిపోర్టులోని విషయాలనే చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు.

నెయ్యికి జరిపిన పరీక్షల్లో ‘ఎస్ వాల్యూ’ లో తేడా ఉందని, కల్తీ జరిగే అవకాశం ఉందని ఆ నివేదికలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సోయాబీన్, కోకోనట్, పామ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, లార్డ్ వంటి అవశేషాలు ఉండే అవకాశముందని ఆ నివేదికలో ఉందని తెలిపారు. వైసీపీ హయాంలో 2022 ఆగస్టు 3న బీటా సిటోస్టెరాల్ ఉన్నట్టు రిపోర్టు వచ్చిననా దాన్ని కొనసాగించారని, తమ తప్పును వైసీపీ నేతలు కప్పిపుచ్చుకున్నారని ఆరోపించారు.

ఉద్దేశ్యపూర్వకంగానే ఫేక్‌ డాక్యుమెంట్లతో నెయ్యికి టెండర్లు కేటాయించారని, ఆ టెండర్ల పాపంలో భాగస్వాములైన అందరినీ నేరస్థులుగా పరిగణిస్తామని చెప్పారు. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డితోపాటు పలువురు అధికారులు ఈ కల్తీ వ్యవహారంలో ఉన్నారని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిట్‌ చెప్పిందని తెలిపారు. బాలాజీ, ధర్మారెడ్డి, సింఘాల్‌ పై చర్యలకు సిట్‌ సిఫార్సు చేసిందని అన్నారు.