తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్రస్థాయి రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై వైసీపీ నేతలకు టీడీపీ నేతలు…టీడీపీ నేతలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు మాత్రం జనసేన నుంచి పెద్దగా కౌంటర్లు వస్తున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే జనసేన నేతల తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు.
జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో జనసేన నేతలు విఫలమవుతున్నారని పవన్ అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి పవన్ దిశానిర్దేశం చేశారు.
లడ్డూ వ్యవహారంలో ఒక్కరు కూడా మాట్లాడలేదని, అన్నింటికీ తానే సమాధానం చెప్పాలా అని పవన్ ప్రశ్నించారు. అటువంటప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎందుకు ఉన్నారని పవన్ అడిగినట్టు తెలుస్తుంది. నేతల వ్యక్తిగత వ్యవహారాల వల్ల పార్టీకి నష్టం కలగకూడదని, సిద్ధాంత పరంగా, సబ్జెక్ట్ పరంగా మాత్రమే మాట్లాడాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తన సోదరుడు నాగబాబుపై కూడా పవన్ కాస్త అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మహిళల వస్త్రధారణపై మాట్లాడి సోషల్ మీడియాలో నాగబాబు స్పందిస్తున్నారని, మరి, లడ్డూ వ్యవహారంలో ఎందుకు మాట్లాడడం లేదని పవన్ ప్రశ్నించారని పుకార్లు వస్తున్నాయి.
ఇక, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ భాస్కర్ కు లండన్ టూర్లకు వెళ్లే టైం ఉంది కానీ, లడ్డూ అంశంపై మాట్లాడేందుకు టైం లేదా అని ప్రశ్నించారట. సోషల్ మీడియాలో, బహిరంగంగా పార్టీపైన, తనపైనా ఎన్నో ఆరోపణలు చేస్తున్నా ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని పవన్ అసహనం వ్యక్తం చేశారట.
ఈ వార్త ఎంతమేరకు నిజమో ఆ మీటింగుకు సంబంధించిన వీడియో జనసేన పార్టీ విడుదల చేస్తే తప్ప స్పష్టత రాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates