ఫ‌లించిన ప‌వ‌న్ ప్ర‌య‌త్నం.. బ‌డ్జెట్‌లో `కొబ్బ‌రి`కి కీల‌క స్థానం

ఏపీలోని కోన‌సీమ ప్రాంతంలో కొబ్బ‌రి సాగు ఎక్కువ‌. దేశంలో కేర‌ళ త‌ర్వాత‌.. కోన‌సీమ‌లో భారీ ఎత్తున కొబ్బ‌రి సాగు చేస్తున్నారు. అయితే.. ఇక్క‌డ తీర ప్రాంతం నుంచి వ‌చ్చే గాలులు, నీటి కార‌ణంగా కొబ్బ‌రి సాగు దెబ్బ‌తింటోంది. చెట్టు పూత పూయ‌దు, పూసినా కాయ‌కాచే వ‌ర‌కు.. ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దీనికితోడు స‌ముద్ర కోత‌.. ఇలా అనేక స‌మ‌స్య‌లు ఇక్క‌డి రైతుల‌ను వెంటాడుతున్నాయి. ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వారిని ఆదుకుంటాన‌ని హామీ ఇచ్చారు.

కొబ్బ‌రి రైతుల‌ను ఆదుకునే బాధ్య‌త కేంద్రానికి ఉంటుంద‌ని.. ఆదిశ‌గా త‌న ప్ర‌య‌త్నాలు చేస్తాన‌ని కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ రైతులకు హామీ ఇచ్చారు. గ‌త ఏడాది కోన‌సీమ‌లో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రైతుల క‌ష్టాలు తెలుసుకున్నారు. వారికి అభ‌యం ప్ర‌సాదించారు.

అనంత‌రం.. ఆయ‌న ఢిల్లీలో ప‌ర్య‌టించి.. కోన‌సీమ కొబ్బ‌రి రైతుల క‌ష్టాల‌ను వివ‌రించారు. కేంద్ర మంత్రుల‌ను క‌లిసిన ఆయ‌న కొబ్బ‌రి స‌మ‌స్య‌లు, రైతులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను తెలిపారు. ఈ క్ర‌మంలో తాజాగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో కొబ్బ‌రి రైతుల‌కు ఊత‌మిస్తూ.. కొన్ని కీల‌క నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు.

1) కొబ్బరి ఉత్పత్తిని పెంచడం కోసం కొబ్బరి ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చినట్లు బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించారు.

2) తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్ల సాగుకు ప్రోత్సాహం ఇవ్వ‌నున్నారు.

3) కాయలు కాయని కొబ్బరి చెట్ల స్థానంలో కొత్త చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు.

4) కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.

5) రిజర్వాయర్లలో చేపల పెంప‌కానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌ల‌లో కొబ్బ‌రికి సంబంధించి ఎక్క‌డా ఎప్పుడూ స్పందించ‌లేదు. కానీ, తొలిసారి.. తాజా బ‌డ్జెట్‌లో కొబ్బ‌రి సాగు, క‌ష్ట‌న‌ష్టాల‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న చేయ‌డం వెనుక ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌య‌త్న‌మే ఉండి ఉంటుంద‌ని కోన‌సీమ రైతాంగం అభిప్రాయ ప‌డుతోంది.

ముఖ్యంగా తీర ప్రాంత కొబ్బ‌రి సాగుకు కేంద్రం స‌హ‌క‌రించ‌డం ఇదే తొలిసారి అని పేర్కొంటున్నారు. దీంతో ఇప్ప‌టికి త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యే మార్గం ఏర్ప‌డింద‌ని సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.