అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నంద్యాలలో అర్ధరాత్రి చంద్రబాబును అరెస్టు చేసేందుకు వెళ్లి తెల్లవారుఝాము వరకు హైడ్రామా నడుమ పోలీసులు ఆయనను అరెస్టు చేయడం సంచలనం రేపింది.

కట్ చేస్తే ఈ కేసులో విచారణ జరిపిన సీఐడీ అధికారులు చంద్రబాబుకు గతంలోనే క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా ఆ కేసులో ఈడీ కూడా చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది.

స్కిల్ కేసుకు సంబంధించి విశాఖపట్నంలోని కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను ఈడీ దాఖలు చేసింది. ఈ కేసులో సీఎం చంద్రబాబుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం లేదని ఆ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై నమోదైను కేసును సీఐడీ గతంలోనే విత్‌డ్రా చేసుకుంది. దీంతో, ఈ కేసు నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయట పడ్డారు.

2023లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కాంట్రాక్ట్‌లో చంద్రబాబు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన తర్వాత ఏ కాంట్రాక్ట్ లో అయినా ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందని టీడీపీ నేతలు అప్పట్లోనే ప్రశ్నించారు.

కానీ, కక్ష సాధించాలన్న ఉద్దేశ్యంతో దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును జగన్ సర్కార్ ఉంచిందని టీడీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఓ రకంగా చంద్రబాబు అక్రమ అరెస్ట్…జగన్ పతనానికి నాంది పలికిందని టీడీపీ నేతలు అంటుంటారు.