ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ భవన్ దగ్గరకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఆ ఘటన కవరేజీ కోసం మీడియా ప్రతినిధులు అక్కడకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్, కెమెరామెన్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.

వారిపై కుర్చీతో దాడిచేసి కెమెరామెన్ దగ్గర నుంచి కెమెరా లాక్కొని కింద పడేసి కాళ్లతో తొక్కి ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ కార్యక్రమాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులు కవర్ చేయొద్దని బెదిరించారు. అంతేకాదు, ఆ ఛానెల్ జర్నలిస్టులు కనిపిస్తే దాడులు చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు.

అయితే, తమ కార్యక్రమాలు కవర్ చేయొద్దని హెచ్చరించి అక్కడి నుంచి ఆ కెమెరామెన్ ను పంపించి వేస్తే సరిపోయేదని, ఇలా భౌతిక దాడులకు పాల్పడడం సరికాదని అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, ఈ దాడిని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మీడియా ప్రతినిధిపై బీఆర్ఎస్ గూండాల తీరు బాధాకరమని, ఇది మంచి సంప్రదాయం కాదని బండి సంజయ్ అన్నారు.

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని , ఇది మంచి సంస్కృతి కాదని కిషన్‌రెడ్డి హితవు పలికారు. ఈ దాడి అమానుషమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాలుగో స్తంభంపై బీఆర్ఎస్ దాడులు చేస్తే చూస్తూ ఉరుకోమని వార్నింగ్ ఇచ్చారు.

పార్టీలు.. మీడియా సంస్థల మద్యం వైరం ఉండడం రాజకీయాల్లో కొత్త కాదు. కానీ ఆ వైరం హద్దులు దాటి ఇటువంటి పరిణామాలకు దారితీయకూడదు. పార్టీ బ్యాన్ చేసినప్పుడు ఆ మీడియా ప్రతినిధులు వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ వాళ్ళు వచ్చినా ఆ పార్టీ నేతలు బాధ్యతా యుతంగా వారి ప్రవేశాన్ని అడ్డుకొని తిరిగి పంపించేస్తే సరిపోతుంది.

అలా కాకుండా ఈ వైరానికి అసలు సంబంధమే లేని ఒక సాధారణ రిపోర్టర్ ను అలా దాడి చెయ్యడం సరైన పద్ధతి కాదు. ఇది పార్టీకి, పార్టీ అధినేతకు చెడ్డ పేరు తీసుకువస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నది ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.