‘గద్దర్ అన్నను గేటు బయట నిలబెట్టింది ఆయనే’

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ ఎస్ నేత జోగినిపల్లి సంతోష్ రావు ఈ రోజు సిట్ విచారణకు హాజరు కాబోతోన్న సంగతి తెలిసిందే.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సంతోష్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతో ఈ రోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలోనే సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు రక్త కన్నీరు తెప్పించిన మొదటి దుర్మార్గుడు సంతోష్ రావేనని కవిత అరోపించారు. పార్టీకి, కేసీఆర్ కు ఉద్యమకారులను దూరం చేసిన మొదటి దెయ్యం కూడా ఆయనేనని ఆరోపణలు చేశారు.

గద్దర్ అన్నను గేటు దగ్గర నిలబెట్టినా, ఈటల రాజేందర్ వంటి ఉద్యమ నాయకులు బీఆర్ ఎస్ వీడినా అందుకు కారణం సంతోష్ రావేనని, ఆ పాపం ఊరికే పోదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ రావు గూఢచారి అని, ఆయనతో సంతోష్ అంటకాగుతున్నారని ఆరోపించారు.

కేసీఆర్ ఫాం హౌస్ సమాచారాన్ని రేవంత్ రెడ్డికి సంతోష్ రావు అందిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ ఏం తిన్నా. ఏం చేసినా.. సగం ఇడ్లి తిన్నాడా.. మొత్తం ఇడ్లి తిన్నాడా అన్న విషయాలతో సహా సమాచారం ఇచ్చేది సంతోష్ రావేనని విమర్శించారు.

కాబట్టి సంతోష్ రావును రేవంత్ రెడ్డి శిక్షిస్తాడంటే తాను నమ్మడం లేదన్నారు. సంతోష్ రావు వంటి దుర్మార్గుడికి హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు మద్దతిస్తున్నారో అర్థం కావడం లేదని, చట్టం కరెక్టుగా పనిచేస్తే సంతోష్ రావుకు శిక్ష తప్పదని జోస్యం చెప్పారు.