2 వారాల్లో తేలిపోనున్న వివేకా మ‌ర్డ‌ర్ కేసు?

ఎస్‌! నిజ‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు దాగుడుమూత‌లుగా ఉన్న ఈ కీల‌క కేసులో రెండు వారాల్లో కీల‌క నిర్ణ‌యం వెలుగు చూడ‌నుంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ కేసు విచార‌ణ అనేక మ‌లుపుల త‌ర్వాత‌.. సీబీఐ చేప‌ట్టింది. అయితే.. విచార‌ణ పూర్త‌యిన‌ట్టుగా కొన్నాళ్ల కింద‌టే సిబీఐ కోర్టు.. తెలంగాణ హైకోర్టుకు విన్న‌వించింది.

కానీ, త‌మ‌కు అనుమానాలు ఉన్న వ్య‌క్తుల‌ను విచారించ‌కుండానే.. కేసు విచార‌ణ ఎలా పూర్తి చేస్తారంటూ.. వివేకానంద‌రెడ్డి కుమార్తె సునీత మ‌ళ్లీ సీబీఐ కోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌లో ప్ర‌ధానంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తిల‌ను పేర్కొన్నారు. వివేకా మృతి చెందిన రోజు వారికి మాత్ర‌మే ఫోన్లు ఎందుకు వచ్చాయ‌ని.. అది కూడా ముందే వారికి ఎలా తెలిసింద‌ని దీనిపై విచార‌ణ చేయాల‌ని సునీత కోరుతున్నారు.

దీనిని ప‌క్క‌న పెట్టిన సీబీఐ కోర్టు.. ఇత‌ర విష‌యాలు విచారించాల‌ని కోరింది. బంధువులు అన్నాక‌.. ఫోన్లు రాకుండా ఉంటాయా? ఎవ‌రికి ముందు తెలిస్తే..ఏంటి? అని కోర్టు అప్ప‌ట్లో వ్యాఖ్యానించింది. దీంతో సునీత మ‌రోసారి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. వివేకా హ‌త్య కేసులో ఎవ‌రినైనా విచారించాల్సింది ఉందా? అంటూ.. సీబీఐని ప్ర‌శ్నించింది.

అంతేకాదు.. సునీత చెబుతున్న విష‌యంపై మీకు క్లారిటీ ఉందా అని సీబీఐ అధికారుల‌ను కోరింది. విచార‌ణ మ‌రోసారి చేయాల‌ని అనుకుంటే.. ఎవ‌రినైనా క‌స్ట‌డీలోకి తీసుకుని విచారించాల‌ని అనుకుంటే చెప్పాల‌ని.. దానికి తాము సంపూర్ణంగా స‌హ‌క‌రిస్తామ‌ని కూడా కోర్టు స్ప‌ష్టం చేసింది.

అయితే.. దీనిపై స్పందించిన సీబీఐ.. రెండు వారాల్లో అన్ని వివ‌రాల‌ను కోర్టుకు చెబుతామ‌ని తెలిపింది. సో.. రెండు వారాల్లో ఈ కేసు ఒక కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇత‌రుల‌ను విచారించాలా..? లేక‌.. ఇక్క‌డ‌తో ముగించాలా? అనేది సీబీఐ తేల్చ‌నుంది.