నాడు జగన్ నేడు కేటీఆర్… సేమ్ టు సేమ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హరీశ్ రావు ఈ రోజు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. భారీ పోలీసు బందోబస్తు మధ్య హరీశ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితోపాటు పోలీసులకు, అధికారులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఏం చేసుకుంటారో చేసుకోవాలని, ఆయనను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో భాగస్వాములవుతున్న అధికారులను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పోలీసులు, అధికారులు రిటైర్ అయినా సరే వదిలిపెట్టబోమని, వారిపై న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రెండున్నరేళ్లలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మూడ్ ఏంటో అందరికీ తెలిసిందని అన్నారు. పోలీసులను, అధికారులను రేవంత్ ప్రభుత్వం అడ్డగోలుగా వాడుకుంటోందని…రిటైర్ అయిన అధికారిని తీసుకు వచ్చి 40 రోజుల పాటు జైల్లో పెట్టారని గుర్తు చేశారు.

అయితే, రేవంత్ చూపిన దారిలోనే భవిష్యత్తులో తాము కూడా నడుస్తామని వార్నింగ్ ఇచ్చారు. రిటైర్ అయితే తప్పించుకుంటాం అనుకోవద్దని, రేవంత్ చెప్పినట్లు ఆడే వారిని వదిలిపెట్టబోమన్నారు. ఎమర్జెన్సీ అయితే మీరు లోపల ఉంటారని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. ఎవరు లోపలుండాలో…బయటుండాలో కాలం, ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిదని హితవు పలికారు.

అలా కాదు అని, ఈ రోజు నాటకాలాడుతున్న వారందరికీ చెబుతున్నానని, రేవంత్ రాజకీయ క్రీడలో అధికారులు, పోలీసులు బలవుతారని హితవు పలికారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్యపోరులో జర్నలిస్టులు బలయ్యారని గుర్తు చేశారు.

అయితే, ఏపీ మాజీ సీఎం జగన్ కూడా ఇదే తరహాలో ఏపీలో అధికారులు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయినా వదలబోమని, వారిని తీసుకువచ్చి కేసులు పెట్టి జైల్లో వేస్తామని జగన్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్, కేసీఆర్, జగన్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందేనని, అందుకే జగన్ డైలాగ్ ను కేటీఆర్ కాపీ కొట్టి ఆయనలాగే వార్నింగ్ ఇచ్చారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.