ఉత్తరాదిలో బలంగా పాతుకుపోయిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేయాలని చాలాకాలంగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రయత్నాలు కర్ణాటకలో కొంతవరకు సఫలమైనప్పటికీ కేరళం, ఏపీ, తెలంగాణ, తమిళనాడులో మాత్రం విఫలప్రయత్నాలుగానే మిగిలాయి. కాస్తో కూస్తో తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది అనుకున్న తరుణంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించారని, ఆ తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోయిందని టాక్. ఆ తర్వాత కిషన్ రెడ్డి పగ్గాలు చేపట్టినా..ఆ గ్రాఫ్ మరింత దిగజారిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ చేయడం వృథా అని బీజేపీ అధిష్టానం అనుకున్నట్లు కనిపిస్తోంది.
తాజాగా బీజేపీ ప్రకటించిన నూతన జాతీయ కార్యవర్గ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ప్రాతినిధ్యం దక్కకపోవడమే అందుకు నిదర్శనం. గతంలో కీలక పదవులు నిర్వహించిన టీబీజేపీ నేతలకు ఈసారి బీజేపీ హై కమాండ్ మొండి చేయి చూపించడం చర్చనీయాంశమైంది. గతంలో డీకే అరుణ, బండి సంజయ్, కె.లక్ష్మణ్ తదితరులు జాతీయ కార్యవర్గ జాబితాలో చోటు దక్కించుకున్నప్పటికీ ఈ సారి మాత్రం బీజేపీ పెద్దలు తెలంగాణ బీజేపీ నేతలకు రిక్త హస్తాలు చూపించారు.
తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ జాతీయ కార్యవర్గ నియామకాల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం లభించకపోవడం శోచనీయం. మరోవైపు, బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి సత్సంబంధాలు నెరపుతున్నారని, ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగినా ఆశ్చర్యపోనవరసరం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో పలు రాష్ట్రాలలోని కీలక నేతలను తమవైపుకు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టిన నేపథ్యం బీజేపీకి ఉంది. ఇటువంటి పలు ప్రచారాల నేపథ్యంలోనే తెలంగాణపై బీజేపీ ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates