అత‌ను జ‌న‌సేన నుంచి ఔట్… ఆమె బీజేపీలోకి

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ మీద లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లో నిలిచిన శ్ర‌ష్ఠి వ‌ర్మ.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆమె కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరింది. సోమ‌వారం హైద‌రాబాద్‌లో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు ఎన్.రామ‌చంద్ర‌రావు, సీనియ‌ర్ నేత ల‌క్ష్మ‌ణ్‌ల స‌మ‌క్షంలో శ్ర‌ష్ఠి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరింది. రామ‌చంద్ర‌రావు.. శ్ర‌ష్ఠికి బీజేపీ కండువా క‌ప్పి పార్టీలోక ఆహ్వానించారు.

శ్ర‌ష్ఠి వ‌ర్మ గురించి ఎవ‌రికీ తెలియ‌ని టైంలో రెండేళ్ల కింద‌ట జానీ మాస్ట‌ర్ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టి వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఒక‌ప్పుడు జానీకి అసిస్టెంట్‌గా చాలా కాలం ప‌ని చేసిందామె. ఆ స‌మ‌యంలోనే త‌న‌పై జానీ ప‌లుమార్లు అఘాయిత్యం చేసిన‌ట్లు ఆమె త‌ర్వాత కేసు పెట్టింది. ఈ కేసులో జానీ కొన్ని నెల‌లు రిమాండులో ఉన్నాడు.

త‌ర్వాత బెయిల్ మీద రిలీజ‌య్యాడు. ఈ కేసు ఇంకా కొన‌సాగుతూనే ఉంది. జానీ తిరిగి సినిమాల‌కు ప‌ని చేస్తున్నాడు. ఇటీవ‌ల డ్యాన్స‌ర్స్ అసోసియేష‌న్లో పెద్ద గొడ‌వ జ‌ర‌గ‌గా.. ఆ టైంలోనూ శ్ర‌ష్ఠి జానీ వ్య‌తిరేక వ‌ర్గం వైపు నిలిచింది. ఇప్పుడు బీజేపీలో చేర‌డం ద్వారా శ్ర‌ష్ఠి వార్త‌ల్లో నిలిచింది.

ఇక్క‌డో కీల‌క విష‌యం ఏంటంటే.. ఏపీలో బీజేపీకి మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన పార్టీకి జానీ మ‌ద్ద‌తుదారు. అత‌ను కొన్నేళ్ల పాటు ఆ పార్టీలో ప‌ని చేశాడు. ఐతే జానీ మీద లైంగిక వేధింపుల కేసు న‌మోద‌య్యాక అత‌ణ్ని పార్టీ నుంచి ప‌క్క‌న పెట్టారు. ఐతే అధికారికంగా పార్టీలో లేక‌పోయినా.. అత‌ను జ‌న‌సేన మ‌ద్ద‌తుదారుగానే కొన‌సాగుతున్నాడు. ప‌వ‌న్‌కు, మెగా ఫ్యామిలీకి జానీ స‌న్నిహితంగానే మెలుగుతున్నాడు. ఇలాంటి టైంలో జ‌న‌సేన మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీలో శ్ర‌ష్ఠి వ‌ర్మ చేర‌డం ఆస‌క్తిక‌ర‌మే. శ్ర‌ష్ఠి పుష్ప‌-2 స‌హా ప‌లు చిత్రాల‌కు అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేసింది.