తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని చూస్తే అదే అర్థమవుతుంది. చెన్నై కంటే వేగంగా హైదరాబాద్ లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అవగాహన చేసుకోవచ్చు. వీకెండ్ అయ్యేసరికి నంబరు ఏమైనా మారతాయేమో చూడాలి. మొన్నటికి మొన్న డిసి కూడా ఇదే తరహాలో మన దగ్గరే స్పీడ్ చూపించింది. దెబ్బకు లోకేష్ కనగరాజ్ ఆఘమేఘాల మీద థియేటర్ విజిట్స్ కు వచ్చి ఆడియన్స్ కి థాంక్స్ చెప్పాడు.

కానీ సూర్య సినిమా విషయంలో జరుగుతున్న పరిణామమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక తెలుగు దర్శకుడు తీయడం వల్ల ఓన్ చేసుకోలేకపోతున్నారా లేక ఇంకేదైనా కారణం ఉందాని విశ్లేషకులు అనాలిసిస్ చేసే పనిలో పడ్డారు. సింపుల్ గా చెప్పాలంటే కోలీవుడ్ ఆడియన్స్ సెన్సిబుల్ గా ఉండరు. మోటుతనం, పల్లెటూరి నేపథ్యం, హద్దులు దాటిన మెలోడ్రామాలు వాళ్లకు త్వరగా కనెక్ట్ అవుతాయి. విజయ్ వారసుడు సీరియల్ లా ఉన్నా ఆదరణ దక్కించుకోవడానికి కారణం ఇదే. దానికి విజయ్ స్టామినా కూడా దోహద పడింది కానీ అది వేరే విషయం.

మన దర్శకులు తీసే వాటిలో డ్రామా సున్నితంగా ఉంటుంది. ఓవర్ హైప్ లేదా శృతి మించడం ఉండదు. అందుకే సూర్య, రాధికా శరత్ కుమార్, మమిత బైజుల మధ్య సన్నివేశాలను చాలా మెచ్యూర్ గా చూపించారు వెంకీ అట్లూరి. మాములుగా అయితే ఎబెట్టుగా అనిపించాల్సిన కాండోమ్ ఎపిసోడ్ మాములుగా వెళ్లిపోయిందంటే వెంకీ హ్యాండిల్ చేసిన విధానం అంత కన్విన్సింగ్ గా ఉండటం వల్ల. ఇది తమిళ జనాల అభిరుచికి విరుద్ధంగా అనిపించే ఛాన్స్ ఉంది.

అలాని వాళ్ళను నెగటివ్ గా ఏమి అనడం లేదు. ఒక్కో చోట ఒక్కో అభిరుచి ఉంటుంది. మలయాళంలో బబుల్  గమ్ లా సాగదీసిన క్రైమ్ థ్రిల్లర్లు విపరీతంగా ఇష్టపడతారు. వాటిని మనం ఓటిటిలో చూడగలం కానీ థియేటర్లలో తట్టుకోలేం. లేచి వచ్చేస్తాం. అందుకే అవి ఎక్కువ శాతం డబ్బింగ్ కావు. అల వైకుంఠపురములో, అఆ లాంటివి మన దగ్గరే ఆడతాయి. తమిళంలో వర్కౌట్ కావు. గత ఏడాది కుబేర ఇక్కడ పాసయ్యింది కానీ ధనుష్ స్వంత రాష్ట్రంలో ఫ్లాప్ గా నిలిచింది. ఇలా ఉంటాయి డబ్బింగ్ ముచ్చట్లు.