కొత్త పద్దతిలో రైతు సంఘాల ధర్నా

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన కొత్త పద్దతులను సంతరించుకుంటోంది. కొత్త చట్టాలను నిరసిస్తు గడచిన 17 రోజులుగా ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘూ దగ్గర వేలాదిమంది రైతులు క్యాంపు వేసి మరీ ఉద్యమం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయ చట్టాలకు వీళ్ళు ఎంతగా పట్టుబడుతున్నారో కేంద్రప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ఉంది. ఎట్టి పరిస్దితుల్లోను నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేది లేదని తెగేసి చెప్పేసింది. దాంతో కేంద్రంతో తాడేపేడో తేల్చుకోవాలని రైతు సంఘాలు కూడా డిసైడ్ అయ్యాయి.

ఆందోళన చేస్తున్న పంజాబ్, హర్యానాలోని రైతుసంఘాలు డిసైడ్ అయ్యాయి బాగానే ఉంది. మరి వాళ్ళకు మద్దతు పెరగటం ఎలా ? ఇక్కడే రైతులు నూతనంగా ఆలోచించారు. తమ కుటుంబసభ్యుల్లోని ఒక్కోరిని కూడా ఆందోళనకు మద్దతుగా పిలిపించుకుంటున్నారు. ఇక రైతుల కుటుంబాల నుండి స్వచ్చంధంగా వస్తున్న కుటుంబసభ్యుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. భర్త కోసం భార్య, తండ్రి కొడుకు కోసం కొడుకు, సోదరుడి కోసం సోదరి, కొడుకు కోసం తల్లి ఇలా కుటుంబంలో నుండి ఎవరో ఒకరు సింఘూ సరిహద్దులకు చేరుకున్నారు.

మొత్తం మీద రైతుసంఘాల ఉద్యమం దేశమంతా పాకుతోందన్నది వాస్తవం. రైతుల ఉద్యమాన్ని కేంద్రమంత్రులు చాలా హేళనగా మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు పంజాబ్ రైతుల్లో తప్ప ఇంకెక్కడా వ్యతిరేకత లేదంటూ చాలా చులకనగా మాట్లాడారు. దాంతో పంజాబ్ రైతులకు మద్దతుగా హర్యానా, రాజస్ధాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల రైతులు కూడా సింఘూకు చేరుకుంటున్నారు.

ఈరోజు సింఘూలో రైతుసంఘాలు చేస్తున్న నిరాహారదీక్షకు మద్దతుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రైతులంతా దీక్షలో కూర్చోబోతున్నట్లు అఖిలభారత్ రైతు సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. సింఘూ దగ్గరే ఉద్యమం చేయటానికి వీలుగా 6 మాసాలకు సరిపడ నిత్యావసర సరకులను రైతులు రెడీ చేసుకున్నారు. బియ్యం, గోధుమలు, పప్పులు, ఉప్పులు, నూనెలు, పొయ్యిలు, కట్టెలు, అవసరమైన మందులు, టెంట్లు, దుప్పట్లు, దిండ్లు చలికి తట్టుకోవటానికి హీటర్లు, వేడినీళ్ళ కోసం హీటర్లు ఇలా సమస్త ఏర్పాట్లతో రైతుల కుటుంబసభ్యులు తమతో పట్టుకొచ్చారట.

దేశవ్యాప్తంగా రైతులు రోడ్ల మీదకు వచ్చేముందే కేంద్రం రైతు డిమాండ్లను ఎంత తొందరగా పరిష్కరించుకుంటే అంత మంచిది. లేకపోతే భవిష్యత్తులో కేంద్రం లేదా ఎన్డీయేకి నేతృత్వం వహిస్తున్న బీజేపీ చాలా నష్టపోవాల్సొస్తుందనే అనిపిస్తోంది.