హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం కారణంగా రెండు నెలల క్రితమే సెలవుపై వెళ్లిన డీజీపీ శత్రుజీత్ కపూర్ను తాజాగా ఆ పదవి నుంచి పూర్తిగా తప్పించింది. ఆయన స్థానంలో ఓపీ సింగ్ను ఇన్ఛార్జ్ డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూరన్ కుమార్ ఆత్మహత్య తర్వాత ప్రతిపక్షాల నుంచి వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత అక్టోబర్ 7న 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పూరన్ కుమార్ తనను తాను కాల్చుకుని చనిపోయారు. ఘటనా స్థలంలో దొరికిన ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అందులో డీజీపీ కపూర్తో సహా పలువురు సీనియర్ అధికారులు తనను కులం పేరుతో వివక్ష చూపారని, మానసికంగా వేధించారని ఆయన ఆరోపించారు. బహిరంగంగా అవమానాలకు గురిచేశారని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ ఆరోపణలు రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో అక్టోబర్ 14నే డీజీపీ కపూర్ను ప్రభుత్వం సెలవుపై పంపించింది. ఇప్పుడు తాజాగా ఆయనను డీజీపీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి, హర్యానా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించారు. ఒక డీజీపీ స్థాయి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం, ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది.
పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారి అమ్నీత్ పి. కుమార్ డిమాండ్ మేరకే విచారణ వేగవంతమైంది. నిష్పక్షపాత విచారణ జరుపుతామని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చండీగఢ్ పోలీసులు, ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే ఆమె పోస్ట్ మార్టంకు అంగీకరించారు. తన భర్త మరణానికి కారణమైన అధికారులను వదిలిపెట్టకూడదని ఆమె గట్టిగా కోరారు.
ప్రస్తుతానికి ఓపీ సింగ్కు డీజీపీగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన డిసెంబర్ 31న రిటైర్ కానుండటంతో, కొత్త డీజీపీ ఎంపిక కోసం ప్రభుత్వం యూపీఎస్సీకి ప్రతిపాదనలు పంపే యోచనలో ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates