అయోధ్యకు బుల్లెట్ ట్రైన్…మోడీ సర్కార్ ఘనత

ప్రధాని మోడీ హయాంలో చైనాకు దీటుగా భారత్ ఎదిగేందుకు కొంతకాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. డ్రాగన్ దేశానికి ఏమాత్రం తీసిపోమన్న రీతిలో మన దేశంలోనూ అత్యాధునిక సాంకేతికతను పరిచయం చేసేందుకు మోడీ సర్కార్ పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్ లో అహ్మదాబాద్ – ముంబైల మధ్య బుల్లెట్ ట్రైన్ పరుగుపెట్టించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇక, తాజాగా మరో రెండో బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయోధ్యకు బుల్లెట్ ట్రైన్ వేసేందుక మోడీ సర్కార్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వారణాసి కారిడార్ పేరుతో కొత్త బుల్లెట్ ట్రైన్ రూట్‌ను సిద్ధం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. దాదాపు 800 కిలో మీటర్లు పొడవుండే ఈ కారిడార్ ….ఢిల్లీ నుంచి మధుర, ప్రయాగ్‌రాజ్, వారణాసి, ఆగ్రా, కాన్పూర్, జెవర్ ఎయిర్‌పోర్టులను కలుపుతూ వెళ్లనుందని సమాచారం.

లక్నో, రాయబరేలీలను కూడా తాకుతూ వెళ్లే విధంగా ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఢిల్లీ-వారణాసి బుల్లెట్ ట్రైన్ రూట్ నిర్మాణ పనులకు సంబంధించిన సర్వేను రాడార్ ద్వారా నిర్వహించనున్నట్లు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు వెల్లడించారు. రాడార్ ద్వారా 12 రోజుల్లో సర్వే పూర్తి చేయవచ్చని, మామూలుగా అయితే 12 నెలలు పడుతుందని వారు వివరించారు.

అహ్మదాబాద్ – ముంబై బుల్లెట్ ట్రైన్ మార్గానికి కూడా రాడార్ సర్వేనే నిర్వహించామన్నారు. జీపీఎస్, లేజర్ డాటా, ఫోటోలు, రాడార్ అందించిన సమాచారం ప్రకారం సర్వేను పూర్తి చేస్తామని తెలిపారు. మరోవైపు, ముంబై – హైదరాబాద్ లతోపాటు మరిన్ని నగరాల మధ్య కూడా బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించే ఆలోచనలో కేంద్ర ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ బుల్లెట్ ట్రైన్ పరుగుపెట్టాలంటే మాత్రం మరికొంత కాలం వేచి చూడాలని ఎన్‌హెచ్ఎస్ఆర్ఎల్ ప్రతినిధిలు చెబుతున్నారు.