బండ్ల గణేష్‌కు అక్కడా షాకే

ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌‌కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్‌కు చెందిన పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్‌కు చెందిన 500 గజాల స్థలాన్ని యూనియన్ బ్యాంకు వేలం వేయడం చర్చనీయాంశం అయింది. బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు ఈ ఆస్తిని గణేష్ కుటుంబం తనఖా పెట్టగా.. సమయానికి రుణం చెల్లించకపోవడంతో ఆ స్థలాన్ని వేలం వేసి డబ్బులు జమ చేసుకున్నారు యూనియన్ బ్యాంకు అధికారులు. దీనిపై బండ్ల గణేష్ కోర్టుకు ఎక్కినా ఫలితం లేకపోయింది. 

హైకోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రాగా.. తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు అక్కడ కూడా బండ్ల గణేష్‌కు ఎదురు దెబ్బ తప్పలేదు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. బండ్ల పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టాడు. ఇది కేవలం 500 గజాల ప్రాపర్టీకి సంబంధించిన అంశమని.. తాను మొత్తం ఆస్తి పోగొట్టుకున్నట్లు కొందరు భావిస్తున్నారని పేర్కొన్న బండ్ల.. తాను సుప్రీం కోర్టు తీర్పును శిరసావహిస్తానని స్పష్టం చేశాడు.

‘‘షేక్‌పేటలోని అపర్ణా సినార్ వ్యాలీలో ఉన్న 500 గజాల ఒక్క ప్రాపర్టీ మాత్రమే ఈ కేసుకు సంబంధించినది. కొందరు నా మొత్తం ఆస్తి ఈ కేసుకు సంబంధించిందని లేదా మొత్తం ఆస్తినే కోల్పోయానని అపోహ పడుతున్నారు. అది పూర్తిగా అవాస్తవం. ఈ కేసు షేక్‌పేటలోని అపర్ణా సినార్ వ్యాలీలో ఉన్న 500 గజాల ఒక్క ప్రాపర్టీకి మాత్రమే పరిమితమైంది. ఆ ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ వారు 2022లో ₹8.51 కోట్లకు విక్రయించారు. 

ఆ విక్రయాన్ని నేను చట్టపరంగా సవాలు చేశాను. డీఆర్‌టీలో మాకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ, అనంతరం హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో మా పిటిషన్ తిరస్కరించబడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును నేను సంపూర్ణంగా గౌరవిస్తున్నాను. భారత న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. న్యాయస్థానాల తీర్పులను గౌరవించడం ప్రతి పౌరుని బాధ్యతగా నేను భావిస్తున్నాను. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తూ, భారత రాజ్యాంగం మరియు న్యాయవ్యవస్థ పట్ల నా గౌరవాన్ని మరోసారి వ్యక్తం చేస్తున్నాను’’ అని బండ్ల పేర్కొన్నాడు.