లోకేష్ సహనానికి బాబు ప్రశంసల జల్లు

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఏక‌బిగిన ఏడున్న‌ర గంట‌ల పాటు నిల‌బ‌డి.. ప్ర‌జ‌ల‌కు సేవ‌చేయ‌డాన్ని ఆయ‌న కొనియాడారు. యువ నాయ‌కులు అంద‌రూ ఇలానే ప‌నిచేస్తే.. కూట‌మికి ప్ర‌త్యేకంగా ప్ర‌చారం అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల‌ను పంపిణీ చేయ‌డం ప‌ట్ల చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇంటి ప‌ట్టాల‌ను అందించేందుకు స్వయంగా నారా లోకేష్ చూపిన చొర‌వ‌ను కూడా అభినందించారు.

ఇంటికి – కుటుంబానికి మ‌ధ్య ఎంతో బంధం ఉంటుంద‌న్న చంద్ర‌బాబు.. పేద‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు.. ఇంటి పట్టాల పంపిణీని స్వ‌యంగా చేప‌ట్ట‌డం ఉత్త‌మ మార్గ‌మ‌ని తెలిపారు. అధికారుల‌కు బాధ్య‌త‌లు వ‌దిలేయ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. ఇక నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే త‌ర‌హాలో పేద‌ల‌కు ఇంటి ప‌ట్టాల‌ను స్వ‌యంగా పంపిణీ చేయాలని సూచించారు. తాజాగా జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో చంద్ర‌బాబు ఈమేర‌కు దిశానిర్దేశం చేశారు.

గొడ్డ‌లి పార్టీతో జాగ్ర‌త్త అంటూ.. వైసీపీ విష‌యంలో మంత్రుల‌కు కొన్ని హెచ్చ‌రిక‌లు చేశారు. లేనిపోని వివాదాల‌ను సృష్టించి.. వాటిని కూట‌మి ప్ర‌భుత్వంపై విసిరే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఆరోపించారు. వీటిని ఎప్ప‌టికప్పుడు ప‌సిగ‌ట్టి ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. కేబినెట్ భేటీ అనంత‌రం.. చంద్ర‌బాబు ప‌లు విష‌యాల‌ను మంత్రుల‌తో చ‌ర్చించారు. క్షేత్ర‌స్థాయిలో వ‌స్తున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో మంత్రులు వెనుక‌బడుతున్నార‌ని తెలిపారు. ఈ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవాల‌న్నారు.

ఇక‌, మెగా డీఎస్సీని-నీట్‌ను లింక్ చేసి గొడ్డ‌లి పార్టీ ఏపీలో ఆందోళ‌న‌లు సృష్టించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని.. ఈ ప‌రిస్థితుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. వివాదాలు సృష్టించే వారిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉపేక్షించ‌రాద‌ని ఆయ‌న తెలిపారు. అంతే బ‌లంగా తిప్పికొట్టాల‌న్నారు. మంత్రులు-క‌లెక్ట ర్… మ‌ధ్య స‌ఖ్య‌త ఉండాల‌ని, క‌ల‌సి ప‌నిచేయాల‌ని సూచించారు.