రా ఎన్టీఆర్… మూత ప‌డిపోయింది

గ‌త కొన్ని రోజులుగా మీడియాలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన రా ఎన్టీఆర్ సంస్థ వ్య‌వ‌హారంలో ఊహించ‌ని మ‌లుపు చోటు చేసుకుంది. వంద కోట్ల‌తో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తాం.. ఎన్టీఆర్ చెప్పినా వినేది లేదు.. ఊరు వాడ పేరుతో భారీ కార్య‌క్రమం చేప‌డ‌తాం అంటూ ఘ‌నంగా ప్ర‌క‌టించిన తార‌క్ అభిమాని సాయి రూప్ వెన‌క్కి త‌గ్గాడు.

రా ఎన్టీఆర్ సంస్థ‌ కార్య‌క‌లాపాల‌ను పూర్తిగా ఆపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. రా ఎన్టీఆర్ ఎక్స్ హ్యాండిల్లో ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. ఇందులో విజ‌యం సాధించిన వాళ్లంద‌రికీ మా అభినంద‌న‌లు అంటూ వ్యంగ్యంగా ఒక కామెంట్ పెట్టి రా ఎన్టీఆర్ కార్య‌క‌లాపాల‌కు తెర‌దించింది టీం.
కొన్ని వారాల ముందు ఎన్టీఆర్ అభిమానుల పేరుతో ఊరు-వాడ అనే సేవా కార్య‌క్ర‌మాన్ని రా ఎన్టీఆర్ సంస్థ‌ ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

త‌మిళ‌నాట రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ముందు విజ‌య్ తన అభిమాన‌ల సంఘాల‌తో ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన నేప‌థ్యంలో తార‌క్ కూడా అదే బాట‌లో సాగుతున్నాడ‌నే విశ్లేష‌ణ‌లు మీడియాలో మొద‌ల‌య్యాయి. కానీ ఈ కార్య‌క్ర‌మానికి, తార‌క్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయ‌న ఆఫీస్ నుంచి పీఆర్ టీమ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మ‌రోవైపు తార‌క్ అధికారిక అభిమాన సంఘాల నాయ‌కులు సైతం ఈ సంస్థను తీవ్రంగా వ్య‌తిరేకించారు.

కానీ హైద‌రాబాద్‌, తిరుప‌తి న‌గ‌రాల్లో ప్రెస్ మీట్లు పెట్టిన రా ఎన్టీఆర్ సంస్థ ప్ర‌తినిధి సాయి రూప్.. తాము ఐదారేళ్లుగా ఎన్నో మంచి ప‌నులు చేస్తున్నామ‌ని.. త‌మ సంస్థ‌లో తార‌క్ అభిమానులైన 40 వేల మంది వాలంటీర్లు ఉన్నామ‌ని.. తార‌క్ చెప్పినా తాము విన‌బోమ‌ని, య‌థావిధిగా ఊరు వాడ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని.. ఇలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు. తార‌క్ త‌మ‌తో ఎందుకు మాట్లాడ‌ట్లేద‌ని కూడా ప్ర‌శ్నించాడు.

కానీ ఈ వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ప‌బ్లిసిటీ చేసుకుంటున్నాడ‌ని, ఇదంతా తార‌క్‌కు అప్ర‌తిష్ఠ తెచ్చే వ్య‌వ‌హార‌మ‌ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిప‌డ్డారు. అన్ని వైపులా వ్య‌తిరేక‌త రావ‌డంతో ఇప్పుడు రా ఎన్టీఆర్ సంస్థ త‌మ కార్య‌క‌లాపాల‌ను ఆపేసిన‌ట్లు క‌నిపిస్తోంది.