ఇక్కడ వైసీపీ విమర్శలు.. అక్కడ కేంద్రం ప్రశంసలు

ఏపీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి మన్ననలు పొందుతున్నాయి. ఈ రోజు కేంద్ర మంత్రి ఇక్కడి ఎడ్యుకేషన్‌ మోడల్‌ భేష్‌ అంటూ కితాబిచ్చారు. ఇక్కడ ఉన్న విపక్షం మాత్రం లోకేష్‌ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ల నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా విధానం ఇక్కడ వైసీపీ విమర్శలను, కేంద్రం నుంచి ప్రశంసలను అందుకుంటోందని పలువురు అనుకుంటున్నారు.

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు, లోకేష్‌ చొరవ బాగుంది అంటూ ఆ కేంద్ర మంత్రి చెప్పడం ఏపీకి మేలు జరిగే అంశమే. ఈ రోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఏమన్నారంటే.. ఏపీలో నాణ్యమైన విద్యా విధానం అమలులో ఉంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి విధానాన్ని అవలంబించవచ్చు అన్నారు. సీఎస్‌ఆర్‌ నిధులతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఏపీ మోడల్‌ మాగుందంటూ ఇతర రాష్ట్రాలు కూడా సృజనాత్మక విధానాలను అవలంబిస్తున్నాయని కితాబిచ్చారు.

ఏపీలో విద్య, ఐటీ మంత్రిగా నారా లోకేష్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా విధానంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉండకూడదనే ఉద్దేశంతో మెగా డీఎస్సీని నిర్వహించి 16వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. పాఠశాల విద్యార్థులకు తల్లికి వందనం పథకంలో ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.

కొద్ది రోజుల కిందట మెగా పేరెంట్‌ మీటింగ్‌ 2.0 విజయవంతంగా నిర్వహించారు. తొలి నుంచీ లోకేష్‌ను టార్గెట్‌ చేస్తూ వైసీపీ ప్రస్తుత విద్యావిధానంపై విమర్శలను చేస్తోంది. అయితే లోకేష్‌ చేపట్టిన సంస్కరణ ఫలితాలు మాత్రం ఏపీ విద్యలో కనిపిస్తున్నాయి. బడుల్లో డ్రాపవుట్స్‌ తగ్గిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం అవుతున్నాయి. ఇదే కేంద్ర మంత్రి ప్రధాన్‌ ఈ రోజు పేర్కొన్నారు. ఆంధ్రా మోడల్‌ బాగుంది అని ఆయన చెప్పడం మంత్రి నారా లోకేష్‌ పనితీరుకు ఇచ్చిన ప్రశంస అని చెప్పుకోవచ్చు.