వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా కుదుపునకు గురైందని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదిలిపోయింది. దీనిని మళ్లీ పునరుద్ధరిస్తున్నాం. ఒక వ్యవస్థను ఎంతగా ధ్వంసం చేయాలో అంతా చేశారు. అదే వ్యవస్థను బాగు చేసేందుకు తిరిగి గాడిలో పెట్టేందుకు ఎంతో శ్రమిస్తున్నాం అని వ్యాఖ్యానించారు.
ఒకవైపు గత పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను బాగు చేస్తూనే మరోవైపు కొత్త వ్యవస్థలను తీసుకువస్తున్నామని తెలిపారు. అదే సమయంలో ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రం ఇంకా క్లిష్ట పరిస్థితిలోనే ఉందన్న చంద్రబాబు వైసీపీ హయాంలో జరిగిన దోపిడి నిధుల విధ్వంసం వంటి వాటిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని వివరించారు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికి పదిహేడు నెలలుగా వ్యవస్థలను చక్కదిద్దే పనిలో ఉన్నాం. అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అంటే వ్యవస్థలను ఎంతగా దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు.
ఐదు సంవత్సరాల విధ్వంసం కారణంగా రాష్ట్రానికి ఆదాయం ఆగిపోయిందని దీంతో ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెప్పారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు ఇదే సమయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇంకా కొంత సమయం వేచి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు అనుకున్నవి అన్నీ జరిగిపోవని గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వమే ఉన్నా పరిస్థితి ఇలా ఉండేది కాదని తెలిపారు. రాష్ట్రం ఈ దేశానికే ఒక ఆదర్శంగా నిలిచేది అని చెప్పారు.
ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చి అన్ని వ్యవస్థలను భగ్నం చేశారని వైసీపీపై మండిపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates