జగన్ ‘అరటి’ విమర్శల్లో నిజమెంత?

ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ‘హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి! ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే! అవును, మీరు  విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్‌లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి…’ ఇంటూ వైఎస్జగన్ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నిజంగా ఇక్కడ కిలో అరటి పండ్ల ధర 50 పైసలేనా..? అంటే.. ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రైతులలో నిరాశ నింపే విధంగా ప్రకటనలు చేయడం సబబు కాదు అంటూ పేర్కొంది. కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకు మాత్రమే అమ్ముడు అవుతున్నాయి అంటూ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో చెప్పడం పూర్తిగా సత్యదూరం అంటూ వివరించింది.

ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం.. . అక్టోబర్ లో ఈ సీజన్ ప్రారంభం కాగానే టన్ను రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకూ అమ్ముడు పోయింది. నవంబరు మొదటి వారంలో ఏ గ్రేడు అరటి పండ్లు రూ.7 వేలు, బీ గ్రేడ్ రూ.4 వేలు, సీ గ్రేడ్ రూ.3వేలకు అమ్ముడు పోయాయి. రెండో వారంలో అవే ధరలు నిలకడగా కొనసాగాయి. మూడో వారంలో ఏ గ్రేడు రూ.8 వేలు, బీ గ్రేడు రూ.4 వేలు, సీ గ్రేడు రూ.3 వేలకు అమ్ముడు పోయాయి.

నాలుగో వారంలో ఏ గ్రేడు రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెరిగింది. బీ గ్రేడు రూ.6 వేల నుంచి రూ 8 వేలకు, సీ గ్రేడు రూ. 4 వేల నుంచి రూ.6 వేల వరకు అమ్ముడు పోయాయి. అనంతపురం, సత్యసాయి జిల్లా, కడప, నంద్యాల జిల్లాల్లో 34,000 హెక్టార్లలో అరటి పంట వేయగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అత్యధిక వర్షాలు కురవడంతో చాలా వరకు అరటి పంట దెబ్బతిన్నది. అయితే పంటల పరిస్థితిని ముందుగానే అంచనా వేసినందున ట్రేడర్లు, ఎగుమతిదారులతో అరటి పంట పండే అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేసి తగిన ఆదేశాలు ఇచ్చారు.

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లో కూడా ఇలాంటి సమావేశాలే ఏర్పాటు చేశారు. హర్యానాలోని శీతల గిడ్డంగుల వారితో కూడా మాట్లాడారు. ఫలితంగా ఉత్తర భారత దేశంలోని కొనుగోలు దారులు ఆంధ్రప్రదేశ్ లో పండిన అరటి కొనుగోలు ప్రారంభించారు. కడప, అనంతపూర్ జిల్లాల నుంచి 700 మెట్రిక్ టన్నుల అరటిని ఉత్తర భారత దేశంలోకి పంపి అక్కడ అమ్మడం జరిగింది.

గత వారం రోజులుగా మెట్రిక్ టన్నుకు రూ 2 వేల నుంచి రూ.4 వేలు పెరిగింది. అరటి రైతులకు రవాణా రాయితీ ఇవ్వాల్సిందిగా భారతీయ రైల్వే ను కోరడం జరిగింది. డిసెంబర్ 2వ వారం నుంచి అరటి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వాస్తవాలు ఇలా ఉండగా రైతులలో నిరాశ నింపే విధంగా ప్రకటనలు చేయడం సబబు కాదు. రైతు సోదరులు కూడా వాస్తవాలు గ్రహించి ఇలాంటి ప్రచారాలకు ప్రభావితులు కావద్దని ప్రభుత్వం ఓ ప్రకటనలో వివరించింది.