బాబు టైమిస్తున్నారు.. మరి నాయకులు?

సీఎంగా చంద్రబాబు నిరంతరం ఎంతో బిజీగా ఉంటున్నారు. ఒకవైపు పెట్టుబడుల సదస్సులు, మరోవైపు పార్టీలో ఏర్పడుతున్న సమస్యలు, ప్రభుత్వం పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా ఆయన కృషి చేస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలోని రైతులు, పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు కూడా చంద్రబాబు సమయం కేటాయించాల్సి వస్తోంది. అటు కేంద్రంతో సమన్వయం చేసుకోవడం, అవసరం వచ్చినప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి పరిష్కార మార్గాలు వెతకడం ఆయన రోజువారీ కార్యక్రమంలో భాగంగా మారిపోయింది.

ఇలా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు పార్టీకి సంబంధించిన అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. గతంలో పార్టీకి సమయం కేటాయించకపోవడం వల్లే 2019లో ఓటమి ఎదురైందని చంద్రబాబు అనేకసార్లు చెప్పారు. అందుకే ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలతో, నాయకులతో సమావేశాలు నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి మంగళగిరిలోని పార్టీ కార్యాలయాన్ని వేదికగా చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే మరి పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చకు వస్తోంది. రాష్ట్రస్థాయిలో చంద్రబాబు నాయకులతో మాట్లాడగలరు, మంత్రులతో చర్చించగలరు, పార్టీ నిర్ణయాలు తీసుకోగలరు. కానీ మండల, గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులే చురుకుగా ఉండాలి.

ఈ బాధ్యత జిల్లా ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ నాయకుల పైనే ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో మండల స్థాయి నాయకులు కూడా చురుకుగా వ్యవహరించాలి. కానీ వారు పార్టీ కోసం ఎంత సమయం కేటాయిస్తున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మెజారిటీ నాయకులు పార్టీ పిలుపు వచ్చినప్పుడే జెండా పట్టుకుని బయటకు వస్తున్నారు.

స్వతంత్రంగా పార్టీ కార్యక్రమాల విషయంలో కానీ, పార్టీలో ఏర్పడే సమస్యలను పరిష్కరించే విషయంలో కానీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరి వారికి సమయం లేదా? అంటే చంద్రబాబు కన్నా ఎక్కువ బిజీగా ఉన్నారని చెప్పలేం. అయినప్పటికీ పార్టీకి సమయం కేటాయించడం లేదన్నది వాస్తవం.

దీంతో మండల, గ్రామీణ స్థాయిలో టీడీపీలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నా నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. చంద్రబాబు క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉండటంతో ఆ విభేదాలు బయటకు పెద్దగా రాకుండా ఉన్నాయి.

లేకపోతే ఇప్పటికీ పార్టీ రచ్చరచ్చ అయిపోయేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు చూపుతున్న క్రమశిక్షణను అనుసరించి క్షేత్రస్థాయిలో నాయకులు పార్టీ కోసం సమయం కేటాయించాలి. నాయకులను సమన్వయం చేసే కార్యక్రమాలను చేపట్టాలి. అంతర్గత విభేదాలను పరిష్కరించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

ఇలా చేస్తేనే టీడీపీ భవిష్యత్తు బలపడుతుంది. లేకపోతే చంద్రబాబు ఎంత టైమ్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు.