దేశంలో ఫస్ట్ టైమ్: మావోయిస్టుల ఆయుధ కర్మాగారం స్వాధీనం!

మావోయిస్టులు అనగానే సహజంగా పోలీసు స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను తీసుకువెళ్తారని తెలుసు. లేదా ఒకేసారి గుంపుగా వచ్చి అధికారుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకుంటారన్న వార్తలు కూడా కొన్ని సార్లు వచ్చాయి. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ నేపథ్యത്തിൽ వందల మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. మరికొందరు తెగించి పోరాడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో లొంగిపోయిన అనంతరం మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు చేసి వారి డంప్‌లను స్వాధీనం చేసుకుంటున్నారు.

మావోయిస్టుల డంప్‌లు అంటే ఆయుధాలు, నిత్య వినియోగ సామగ్రి, సాహిత్య పుస్తకాలు, ఫోన్లు ఇలా అనేక వస్తువులను అడవీ ప్రాంతాల్లోని భూగర్భంలో ఎవరు గుర్తించని ప్రాంతాల్లో దాచుకుంటారు. ఎంత అనుభవం ఉన్న అటవీ శాఖ అధికారులు అయినా ఈ డంప్‌లను గుర్తించడం కష్టం. అలాంటిది తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఓ భారీ ఆయుధ కర్మాగారాన్ని సాయుధ బలగాలు గుర్తించారు. ఇటీవలి కాలంలో పోలీసుల ముందు లొంగిపోయిన పెద్ద నాయకులు ఇచ్చిన సమాచారంతోనే ఈ దాడులు చేసినట్టు తెలిసింది.

ఈ క్రమంలో వారికి భారీగా ఆయుధాలు లభించాయి. 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, ఆయుధాల తయారీ సామగ్రి, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఆయుధాలను స్వయంగా తయారు చేసుకునే నైపుణ్యంతో కూడిన సామగ్రి కూడా లభించడం విశేషం. వీటిని సాధారణంగా రక్షణ శాఖ మాత్రమే వినియోగిస్తుందని, ఈ తరహా తయారీ యూనిట్లపై దేశంలో నిషేధం ఉందని ఒక అధికారి తెలిపారు. మందుగుండు తయారీకి సంబంధించిన పుస్తకాలను కూడా గుర్తించారు. అదేవిధంగా తుపాకుల తయారీకి వినియోగించే ప్రత్యేక మెటీరియల్‌తో పాటు ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా వెలుగు చూసిన ఆయుధ తయారీ కర్మాగారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుమారు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ రహస్య ఆయుధ కర్మాగారానికి ముందు చెట్లు, తుప్పలు ఉండటంతో ఎవరు గుర్తించకుండా ప్రత్యేకంగా కంపను ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. అంతేకాదు ఎంతోమంది సీనియర్లు కూడా దీన్ని అటవీ భాగంగానే భావించారని వివరించారు. కాగా ఇప్పటి వరకు 500 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 340 మంది ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు.