ఏపీలో మొంథా తుఫాను ప్రభావం భారీ ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్టయింది. సీఎం చంద్రబాబు తన వయసును పక్కన పెట్టి.. 24 గంటలూ గత రెండు రోజులుగా సమీక్షిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగించకుండా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావం ఏ రేంజ్లో ఉన్నప్పటికీ.. ప్రజలకు నష్టం కలగకూ డదన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇక, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా.. ఇదే పనిలో ఉన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా బరిలో నిలిపి తుఫాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఏ క్షణం ఎలా ఉన్నా.. పరిస్థితులు చేయి దాటినా.. ఎలాంటి ఉపద్రవం ఎదురొచ్చినా దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు.. పార్టీ పక్షాన కూడా చర్యలు చేపడుతున్నారు. మరి.. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటూ.. ప్రజల తరఫున అసెంబ్లీ లో ప్రశ్నిస్తానని చెబుతున్న 11 మార్కుల వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఏం చేస్తున్నారు? అనేది ప్రధాన ప్రశ్న. ఇది కూటమి సర్కారు నుంచి వస్తున్న రాజకీయ విమర్శ కాదు.
సగటు పౌరుడు సామాజిక మాధ్యమం వేదికగా సంధిస్తున్న ప్రశ్న. “జగన్ సర్. మీరు ప్రజల పక్షం నిలబడతానని చెప్పారు. పేదలు, ఎస్సీలు, ఎస్టీల తరఫున మాట్లాడతానన్నారు. మరి ఇప్పుడు ఎక్కడున్నారు సర్?“ అని కొందరు ప్రశ్నిస్తే.. మరికొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. “ఇప్పుడైనా తాడేపల్లినుంచి బయటకు రండి సర్“ అని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, ప్రాథమిక సమాచారం మేరకు జగన్ ఇప్పుడు తాడేపల్లిలో లేరని తెలిసింది. ఆయన ఇప్పటికే సేఫ్ జోన్ చూసుకుని బెంగళూరుకు వెళ్లిపోయారని రాజకీయ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. మరి ఆయనకు ఎందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలో అనేది నెటిజన్ల మరో ప్రశ్న.
వైసీపీ మాత్రం తుఫాన్ ప్రభావం వల్ల ఫ్లైట్ కాన్సిల్ అయ్యింది, దాని వల్లే జగన్ తాడేపల్లికి రాలేకపోతున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. దానికి ఫ్లైట్ లేకపోతే ఏం కారు వేసుకొని రోడ్డు మార్గాన రావొచ్చు కదా అనేది నెటిజన్ల మాట. వైసీపీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates