దేవుడా.. కర్నూలు జిల్లాలో ప్రైవేటు బస్సు దగ్థం.. 20 మందికి పైనే మృతి

ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు (వి. కావేరి) కర్నూలు శివారు చిన్నటేకూరులో ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై జరిగిన ఈ దారుణ రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైనే మరణించారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా చెబుతున్నారు. పన్నెండు మంది వరకు స్వల్ప గాయాలతో బయటపడినట్లుగా తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వి.కావేరీకి చెందిన ప్రైవేటు ట్రావెల్ బస్సు (డీడీ01 ఎన్9490) 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ రోజు తెల్లవారుజామున (శుక్రవారం 3.30గంటల) కర్నూలు శివారు కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఒక బైకును బస్సు ఢీ కొంది. దీంతో మంటలు చెలరేగాయి.

అయితే.. ఈ మంటలు చిన్నవిగానే భావించిన సిబ్బంది వాటర్ బబుల్ తో ఆర్పేందుకు ప్రయత్నించారు.
అయితే.. క్షణాల వ్యవధిలో మంటల తీవ్రతను గుర్తించిన సిబ్బంది ప్రయాణికుల్ని అలెర్టు చేశారు. అత్యవసర అద్దాల్ని పగలకొట్టి బయటకు దూకేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పలువురు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. దీంతో పలువురు బస్సులోనే ఉండిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్ష్యులు అందిస్తున్న సమాచారం ప్రకారం బస్సు నుంచి పన్నెండు మంది స్వల్ప గాయాలతో బయటపడినట్లుగా తెలుుస్తోంది.

ఎంత మంది మరణించారన్న దానిపై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడే చెప్పలేం. వివరాల్ని సేకరిస్తున్నాం. డ్రైవర్ ను.. సహాయక డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం’ అని పేర్కొన్నారు. బస్సు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల్లో అత్యధికులు హైదరాబాద్ కు చెందిన వారుగా భావిస్తున్నారు.

ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్థమైంది. దీంతో.. మంటల్లో కాలిపోయిన వారిని గుర్తించాల్సి ఉంటుంది. బూడిదగా మారిన వారి ఉనికి గుర్తించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాద సమయంలో కొందరు ప్రదర్శించిన మానవత్వం అందరిని కదిలించేలా చేసింది. పుట్టపర్తి నుంచి హైదరాబాద్ కు వస్తున్న హైమ రెడ్డి అనే ఒకరు బస్సు ప్రమాదాన్ని గుర్తించి.. వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు.

ఇక.. హిందూపూర్ కు చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించి.. మానవత్వాన్ని ప్రదర్శించారు. కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎస్ తో పాటు.. ఇతర అధికారులతో మాట్లాడిన చంద్రబాబు.. సహాయ చర్యల్ని చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. మెరుగైన వైద్య సహాయాన్ని అందజేయాలని పేర్కొన్నారు.