మోడీ ప‌ర్య‌ట‌న‌: వైసీపీ మ‌రో యాగీ.. కేంద్రం ఎంట్రీ!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ర్నూలులో ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో అధికార టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అదేస‌మ‌యంలో వైసీపీ సోష‌ల్ మీడియా స‌హా ప్ర‌ధాన మీడియాలో వ‌చ్చిన కొన్ని వార్త‌ల‌పై వెంట‌నే కేంద్ర ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు కూడా జోక్యం చేసుకున్న‌ట్టు రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. దీనిపై త‌మ‌కు నివేదిక ఇవ్వాల‌ని కేంద్ర వ‌ర్గాలు డీజీపీని కోరిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈ వ్య‌వ‌హారంలో అస‌లు ఏం జ‌రిగింద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

ప్రధాన మంత్రి.. గురువారం ఉద‌యం ఢిల్లీ నుంచి క‌ర్నూలు ఎయిర్‌పోర్టుకు(ఓర్వ‌క‌ల్లు) వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికే అధికార పార్టీ స‌హా.. స్థానిక ప్రజాప్ర‌తినిధుల‌ను ప్రొటోకాల్ ప్ర‌కారం ఆహ్వానిస్తారు. ఈ స‌మ‌యంలో స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నేత‌.. విరూపాక్షి, అదేవిధంగా ఎమ్మెల్సీ.. మ‌ధుసూద‌న్‌, క‌ర్నూలు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌(స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి) ఉన్నారు. వీరికి ప్రొటోకాల్ ప్ర‌కారం ప్ర‌భుత్వ అధికారులు ఆహ్వానం పంపారు. వారు వ‌చ్చి ప్ర‌ధానికి పుష్ప‌గుచ్ఛం ఇచ్చి ఆహ్వానం ప‌లికారు.

అయితే.. ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. ఆ త‌ర్వాత‌.. వైసీపీ నాయ‌కులు త‌మ దారిన తాము వెళ్లిపోయి.. మీడియా ముందు.. ప్ర‌ధాని మోడీకి తాము విన‌తి ప‌త్రాలు ఇచ్చామ‌ని చెప్పారు. అంతేకాదు.. రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబు చేస్తున్న మెడిక‌ల్ కాలేజీల‌ ప్రైవేటీక‌ర‌ణ స‌హా క‌ర్నూలులో స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానికి ఫిర్యాదు చేశామ‌ని.. ఆయ‌న సావ‌ధానంగా విన్నార‌ని.. తాము ఇచ్చిన ఫిర్యాదుల‌ను కూడా తీసుకున్నార‌ని చెప్పారు. ఈ వ్య‌వ‌హారం వెలుగు చూడ‌గానే టీడీపీ నాయ‌కులు.. అగ్గిమీద గుగ్గిలంలా మండిప‌డ్డారు.

“మిమ్మ‌ల్ని ప్రొటోకాల్ ప్ర‌కారం ఆహ్వానించాం. మీరు వ‌చ్చి పుష్ప‌గుచ్చాలు మాత్ర‌మే ఇచ్చారు. కానీ.. బ‌య‌ట‌కు వ‌చ్చి ఇలా చెప్ప‌డానికి సి.. లేదా!” అని వ్యాఖ్యానించారు. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటా లు పేలాయి. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై కేంద్ర ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు అలెర్ట‌యిన‌ట్టు స్థానిక పోలీసులు తెలిపారు. అస‌లు ఏం జ‌రిగింది? ప్ర‌ధానికి నిజంగానే వారు విన‌తి ప‌త్రాలు ఇచ్చారా? ఇస్తే.. ఎవ‌రు తీసుకున్నారు? అనే విష‌యాల‌పై నివేదిక ఇవ్వాల‌ని డీజీపీని వివ‌ర‌ణ కోరిన‌ట్టు తెలిసింది. కానీ… రాష్ట్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు మాత్రం.. వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ ఎలాంటి విన‌తులు ఇవ్వ‌లేద‌ని.. కావాల‌నే యాగీ చేస్తున్నార‌ని చెబుతున్నారు.