జోగి ర‌మేష్ అరెస్టు.. రీజ‌నేంటి?

వైసీపీ సీనియర్ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నేత‌.. మాజీ మంత్రి జోగి ర‌మేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం.. ఆయ‌న‌ను స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. త‌న అరెస్టును జోగి త‌ప్పుబ‌ట్టారు. తాను ప్ర‌జ‌ల కోసం రోడ్డుమీద‌కు వ‌స్తే.. పోలీసులు అక్ర‌మార్కుల‌ను కాపాడేందుకు త‌నను అరెస్టు చేశార‌ని అన్నారు. ఇక‌, జోగి అరెస్టును నిర‌సిస్తూ.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. పెద్ద ఎత్తున ధ‌ర్నా చేప‌ట్టారు. దీంతో విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై ట్రాఫిక్ కిలో మీట‌ర్ల మేర నిలిచిపోయింది.

ఏం జ‌రిగింది?

విజ‌య‌వాడ శివారులోని ఇబ్ర‌హీంప‌ట్నంలో నివాసం ఉండే జోగి ర‌మేష్‌.. తాజాగా బుధ‌వారం ఉద‌యం.. టీడీపీ నాయకులు కొండ‌ప‌ల్లి విద్యుత్ ఫ్యాక్ట‌రీ నుంచి ఉత్ప‌త్తి అవుతున్న బూడిద‌(ఫ్లై యాష్‌)ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నారని .. దాని ద్వారా కోట్ల రూపాయ‌లు గ‌డిస్తున్నార‌ని ఆరోపిస్తూ.. బూడిద నిల్వ‌ల‌ను ప‌రిశీలించేందుకు బ‌య‌లుదేరారు. అయితే.. పోలీసులు జోగిని ఆయ‌న అనుచ‌రుల‌ను అడ్డుకున్నారు. ఎలాంటి ముంద‌స్తు అనుమ‌తులు లేకుండా ప‌రిశీల‌న చేయ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. జోగి త‌న అనుచ‌రుల‌తో కొండ‌ప‌ల్లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు.

ఈ క్ర‌మంలో ప‌లు మార్లు చెప్పి చూసిన పోలీసులు.. విధిలేని ప‌రిస్థితిలో అరెస్టు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే .. ఈ సంద‌ర్భంగా జోగి కూడా పోలీసులతో వాద‌న‌కు దిగారు. ఏ అధికారంతో త‌న‌ను అరెస్టు చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాదు.. త‌న‌ను అరెస్టు చేసేందుకు కార‌ణాలు ఏంట‌ని ప్ర‌శ్నించారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌రోవైపు.. టీడీపీ శ్రేణులు కూడా ఆందోళ‌న‌కు రెడీ అవడంతో పోలీసులు జోగిని అరెస్టు చేసి.. విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. దీంతో శ్రేణులు నిర‌స‌న‌కు దిగాయి. ఫ‌లితంగా భారీ ఎత్తున ట్రాఫిక్ ఆగిపోయింది.

ఆది నుంచి ర‌గ‌డే!

మైల‌వ‌రం ఎమ్మెల్యేగా వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌కు, వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగికి మ‌ధ్య వివాదం ఆది నుంచి ఉంది. రాజ‌కీయంగా కూడా ఇరు ప‌క్షాల మ‌ధ్య క‌త్తులు నూరుకునే స్థాయిలో వివాదాలు న‌డుస్తున్నాయి. గ‌తంలో మట్టి, ఇప్పుడు బూడిద‌ల‌ను ఎమ్మెల్యే దోచుకుంటున్నార‌ని జోగి ఆరోపిస్తున్నారు. గ‌తంలోనూ ఒక‌సారి వివాదం అయింది. త‌ర్వాత‌..జోగి కుమారుడిపై అగ్రి భూముల కేసు తెర‌మీద‌కు రావ‌డంతో ఆయ‌న సైలెంట్ అయ్యారు. ఇటీవ‌ల ఈ కేసులో కోర్టు జోగి కుమారుడిని త‌ప్పించింది. దీంతో మ‌రోసారి.. బూడిద‌ పేరుతో జోగి విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. ఎమ్మెల్యేను ల‌క్ష్యంగా చేసుకుని వివాదానికి తెర‌దీశార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.