ఏపీలో మోగిన న‌గారా.. స్థానిక స‌మ‌రానికి రంగం రెడీ!

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయింది. వ‌చ్చే ఏడాదితో రాష్ట్రంలోని కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల‌కు గ‌డువు తీరుతుంది. ఈ క్ర‌మంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని నోటిఫికేష‌న్ జారీ చేశారు. మొత్తం నాలుగు ద‌శ‌ల్లో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. మంగళవారం అమరావతిలో నీలం సాహ్ని మీడియాతో మాట్లాడారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల‌ను స్వేచ్ఛ‌గా ప‌క్ష‌పాత రహితంగా నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంద‌ని తెలిపారు. ఇదేస‌మ‌యంలో బ్యాలెట్ పేప‌ర్ కాకుండా.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు.

ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇదీ..

▪️ 2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
▪️ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురిస్తారు.
▪️ నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి.
▪️ నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి.
▪️ డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు. ఈ సారి స్థానికంగా 33 శాతానికి బ‌దులు 50 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌నున్నారు.
▪️ డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు.
▪️ 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు.

వైసీపీ హ‌యాంలో వివాదం..

వైసీపీ హ‌యాంలో 2021లో స్థానిక స‌మ‌రం జ‌రిగింది. అయితే.. అప్ప‌ట్లో క‌రోనా కార‌ణంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ప్రారంభించి కూడా మ‌ధ్య‌లోనే వాయిదా వేశారు. ఈ మేర‌కు అప్ప‌టి క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ దీనిని తీవ్రంగా త‌ప్పుబ‌ట్ట‌డంతోపాటు.. “చంద్ర‌బాబు క‌మ్మ‌.. నిమ్మ‌గ‌డ్డ కూడా క‌మ్మే కాబ‌ట్టి.. కులాల ప్ర‌కారం న్యాయం చేసుకునేందుకు ఎన్నిక‌ల‌ను నిలుపుద‌ల చేశారు” అంటూ తీవ్ర వివాదానికి దిగారు. ఇక‌,… అప్ప‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన‌ల త‌ర‌ఫున ఎవ‌రినీ నామినేష‌న్ వేయ‌కుండా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నార‌న్న వాద‌న కూడా ఉంది.