కేటీఆర్ పై కవిత షాకింగ్ వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పై, మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన కవితపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే సస్పెన్షన్ అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి హరీష్ రావుతో పాటు తన సోదరుడు కేటీఆర్ ను కూడా కవిత టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు.

పార్టీ ఆఫీసులో కూర్చొని తనపై కుట్ర జరుగుతోందని చెప్పినా కేటీఆర్ స్పందించలేదని కవిత ఆరోపించారు. లేఖ లీక్ కాక ముందు, తాను అమెరికా పర్యటనకు వెళ్లక ముందే ఇదంతా జరిగిందని అన్నారు. 103 రోజుల పాటు తనతో కేటీఆర్ మాట్లాడలేదని అన్నారు. సొంత చెల్లి ఎందుకు బాధపడుతోందని కేటీఆర్ అడగలేదని వాపోయారు. రక్త సంబంధం..అన్నా చెల్లి రిలేషన్ పక్కనపెట్టి చూసినా తాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అని, కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని…పార్టీ పరంగా అయినా తనతో మాట్లాడాల్సిన కేటీఆర్ అలా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ బిడ్డ అయిన తనకే రెస్పాన్స్ రాలేదని, పార్టీలో మిగతా మహిళల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. 5 నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత తాను ప్రజా సమస్యలపై పోరాడానని, వాటిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా కొందరు చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి ఎలా వ్యతిరేక కార్యక్రమాలో చెప్పాలని బీఆర్ఎస్ పెద్దలను నిలదీశారు.