వైసీపీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను పదజాలంతో దూషించడంతో పాటు అవినీతి, అక్రమాలు, వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ రెచ్చిపోయారు. ఆయన ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్నది పార్టీలో చర్చగా మారగా, వైసీపీ అధినేత జగన్ భూమనను హెచ్చరించారన్నది పార్టీ వర్గాల మాట.
సీనియర్ అధికారి శ్రీలక్ష్మి, వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో గనుల శాఖ డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలోనే కర్ణాటకకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం గనులకు అనుమతులు ఇచ్చారన్నది ఆమెపై ఉన్న ఆరోపణ. దీంతో సిబిఐ, ఈడి అధికారులు కూడా ఆమెపై కేసులు నమోదు చేశారు. వైసీపీ హయంలో ఆమెను తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చి, పురపాలక శాఖ వంటి కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.
టీడీఆర్ బాండ్ల విషయంలో అవినీతి జరిగినట్టుగా శ్రీలక్ష్మి టిడిపి నాయకులకు సమాచారం అందిస్తున్నారన్నది భూమన ఆగ్రహానికి ప్రధాన కారణం. కానీ అవినీతి జరిగితే ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. తప్పు చేయకపోతే నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని పట్టుకుని భూమన తీవ్ర వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత దూషణలు చేయడం, బాడీ షేమింగ్ చేయడం తీవ్ర పరిణామాలుగా మారాయి.
దీనిని జగన్ సీరియస్గా తీసుకుని భూమనను వివరణ కోరినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహిళా ఓటు బ్యాంకును కూటమి ప్రభుత్వం ఆకర్షిస్తున్న సమయంలో పార్టీ తరఫున ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నది జగన్ ప్రశ్నించినట్టు తెలిసింది. ముఖ్యంగా తన తండ్రి హయాంలోనూ, తన హయాంలోనూ కీలక అధికారిగా పనిచేసిన శ్రీలక్ష్మిపై దారుణంగా వ్యాఖ్యానించడాన్ని జగన్ తీవ్రంగా తప్పుపట్టినట్టు సమాచారం. దీనికి భూమన ఏ విధంగా సమాధానం ఇస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates