వైసీపీ గొంతెమ్మ కోరిక‌లు!

కోరిక‌లు త‌ప్పుకాదు.. కానీ, అలివికాని కోరిక‌లే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తాయి. రాజ‌కీయాల్లో అయినా అంతే!. ఏపీ విప‌క్ష పార్టీ వైసీపీ విష‌యంలోనూ ఇలానే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. అలివికాని కోరిక‌ల‌తో రాజ‌కీయాలు చేస్తోంది. ఈ నెల 12న జ‌రిగిన పులివెందుల‌, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ స్థానాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. రెండు చోట్లా క‌నీసం డిపా జిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయింది. నిజానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లాలోనే ఉన్న ఈ రెండు జ‌డ్పీలు ఒక‌ప్పుడు వైసీపీకి కంచుకోట‌లు. అయితే.. ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమం, పెట్టుబడుల రాక‌, ఉద్యోగాలు, ఉపాధి అవ‌కాశా ల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు కూట‌మి వైపే మొగ్గు చూపారు.

చెదురు మదురు ఘ‌ట‌న‌లు మిన‌హా.. మొత్తంగా ఈ రెండుఉప ఎన్నిక‌ల‌ను రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు స‌జావుగానే ముగించా రు. అయితే.. స‌హ‌జంగా ఉండే ఫ్రెస్ట్రేష‌న్‌తో పాటు.. రాజ‌కీయ కార‌ణాలు కూడా.. వైసీపిని ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేశాయి. దీంతో త‌న‌ను తాను సంస్క‌రించుకునే ప‌నిని ప్రారంభించాల్సిన పార్టీ.. ఎదురు దాడి చేయ‌డం..ప్రారంభించింది. అంతేకాదు, ఇప్పుడు గొంతెమ్మ కోరిక‌ల‌ను కూడా బ‌య‌ట పెట్టుకుంది. రాష్ట్ర ఎన్నిక‌ల అధికారుల‌కు భారీ ఎత్తున లేఖ‌లు సంధించింది. ‘మాకు ఈ వివ‌రాలు ఇవ్వండి’ అంటూ.. ఆదేశించిన‌ట్టుగా వ్యాఖ్య‌లు రాసింది. అయితే.. ఈ లేఖ‌పై రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు ఎలా స్పందిస్తార‌న్న‌ది చూడాలి.

ఇంత‌కీ వైసీపీ కోరిక‌లు ఏంటంటే..

+ పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి స‌మ‌గ్ర వివ‌రాలు ఇవ్వాలి.

+ పోలింగ్‌ స్టేషన్లు, సీసీ కెమెరా ఫుటేజ్ అందించాలి.

+ పలు ఘటనలకు సంబంధించిన వీడియో కవరేజ్ ఇవ్వాలి.

+ పోలింగ్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్ కూడా ఇవ్వాలి.

+ పోలింగ్ జ‌రిగిన‌ రోజు పోలింగ్‌ బూత్‌ల్లో కూర్చున్న ఏజెంట్ల పేర్లు జాబితా కావాలి.

+ పోలింగ్‌ ఆఫీసర్‌(పీఓ) డైరీ ఇవ్వాలి.

+ ఫామ్‌–12. ఫామ్‌–32 అంశాల పూర్తి వివరాలు, సమాచారం ఇవ్వాలి.

సొంతమ‌నుకున్న‌వారే..

సొంతమ‌నుకున్న అధికారే త‌మ‌కు ఇప్పుడు కొర‌గాకుండా ఉన్నార‌న్న ఆవేదన కూడా వైసీపీలో క‌నిపిస్తోంది. గ‌త వైసీపీ హ‌యాంలో రిటైరైన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్నిని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా అప్ప‌టి సీఎం జ‌గ‌న్ నియ‌మించారు. ప్ర‌స్తుతం కూడా ఆమే ఉన్నారు. అయితే.. ఆమె త‌ట‌స్థంగా విదులు నిర్వ‌హిస్తున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీకి కంట్లో న‌లుసుగా మారింది. “ఏరికోరి ఆరోజు ప‌ద‌వి ఇచ్చాం. అయినా.. మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోవ‌డం లేదు” అంటూ.. నీలం పేరు ఎత్త‌కుండానే గుంటూరుకు చెందిన ఓ నాయ‌కుడు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.