“రాఖీ కట్టించుకోలేని వాడు మహిళల మీద నీతులు చెబుతాడా?”

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై మంత్రి నారా లోకేష్ ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌హిళల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం ‘స్త్రీ శ‌క్తి’ని ప్రారంభించి అనంత‌రం.. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. “కొంద‌రు ఉంటారు. వారిని రాక్ష‌సులు అనాలో.. ఇంకేమైనా అనాలో.. కూడా అర్ధం కాదు. ఎందుకంటే.. వాళ్లు రాక్ష‌సుల‌కంటే కూడా ఘోరంగా త‌యార‌య్యారు. విషం లాంటి మ‌ద్యం అమ్మి.. మ‌హిళ‌ల తాళిబొట్లు తెంపాడు” అని జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

చెల్లితో రాఖీ క‌ట్టించుకోలేని వాడు.. ఇప్పుడు మ‌హిళ‌ల గురించి నీతులు చెబుతున్నాడు.. అని నారా లోకే ష్ మండిప‌డ్డారు. అద్భుతాలన్నీ మహిళలతోనే సాధ్యమవుతాయ‌ని వ్యాఖ్యానించారు. ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభించ‌లేమ‌ని.. ఇదో ఉత్తుత్తి డ్రామా అని వ్యాఖ్య‌లు చేసిన వారు.. ఇప్పుడు త‌మ త‌ల‌లు ఎక్క‌డ పెట్టుకుంటార‌ని వైసీపీ నాయ‌కుల‌పై నిప్పులు చెరిగారు. ఈ ప‌థ‌కం మహిళలకు మరింత శక్తిని ఇస్తుందని లోకేష్‌ చెప్పారు. మ‌హిళ‌ల‌ను ఆది నుంచి గౌర‌వించిన పార్టీ టీడీపీ అయితే.. ఆది నుంచి మ‌హిళ‌ల‌ను అవ‌మానించిన పార్టీ వైసీపీ అని విమ‌ర్శించారు.

“శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. మ‌హిళ‌ల‌ను అస‌భ్యంగా బూతులు తిడుతూ.. అదే గొప్ప అన్నట్టుగా పోస్టులు పెట్టారు. ఇంకా.. కొందరు మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. మ‌హిళల ను అవమానించేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. మహిళలను అసభ్యంగా చూపించే.. సినిమాలు, సిరీస్‌లు రాకుండా ప్రత్యేక చట్టం తేవాలి.” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా త‌న త‌ల్లి భువ‌నేశ్వ‌రి గురించి మాట్లాడుతూ.. ‘5వేల కోట్ల విలువైన కంపెనీని నా తల్లి నడుపుతున్నారు. ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగాలు క‌ల్పిస్తున్నారు. మ‌హిళ‌ల‌కు చేయూత అందిస్తే.. ఎంత ఎత్తుకైనా ఎదుగుతార‌నేందుకు మా ఇల్లే ఉదాహ‌ర‌ణ‌.’ అని చెప్పారు. మ‌హిళలను కించపరిస్తే తోలుతీస్తానని చెప్పండి.. అని లోకేష్ పిలుపునిచ్చారు. ప్ర‌తి ఒక్క‌రికీ చంద్ర‌న్న అండ‌గా ఉన్నార‌ని.. మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్‌, ఆస్తిలో స‌మాన హ‌క్కులు క‌ల్పించ‌డంతోపాటు.. అనేక సంఘాల‌ను కూడా తీసుకువ‌చ్చిన ఘ‌న‌త టీడీపీదేన‌ని చెప్పారు.