జ‌గ‌న్ చేయ‌ని రాజ‌కీయం.. చంద్ర‌బాబు చేస్తే..!

రాజకీయాలు అందరూ చేస్తారు. బ్యాలెన్స్ రాజకీయాలను చేయటం అనేది నాయకులకు చాలా ముఖ్యం. ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా చూసుకోవడం అనేది అధికారంలో ఉన్నవారికి మరింత అవసరం. ఈ క్రమంలో కొంత బ్యాలెన్స్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. నాణానికి ఒకవైపు మాత్రమే చూస్తూ ఉంటే రెండోవైపు దెబ్బ కొట్టే పరిస్థితి ఉంటుంది. ఇది అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకైనా చాలా కీలకం. ఈ విషయంలో టిడిపి అధినేత సీఎం చంద్రబాబు చక్కగా బ్యాలెన్స్‌గా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏడాది కిందట ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని సమన్వయంతో నడిపించడంలో, ప్రజలను మెప్పించడంలోనూ చంద్రబాబు బ్యాలెన్స్‌గా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఉదాహరణకు హామీలు ఇచ్చాం కదా అని సూపర్ 6 పథకాలన్నీ ఒకేసారి ప్రారంభించకుండా విడతల వారీగా వాటిని చేపడుతున్నారు. ఇదే సమయంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. రహదారుల నిర్మాణం, ఇంటింటికి నీళ్లు, ఉద్యోగాలు కల్పన, ఉపాధి అవకాశాలు వంటి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం, విస్తరణ వంటి కార్యక్రమాలతో పాటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు.

పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో కోణం చూస్తే రాజకీయంగా ఎదురవుతున్న సమస్యలను కూడా ఎప్పటికప్పుడు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే చంద్రబాబు చాలా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనేది స్పష్టం అవుతుంది. కేవలం ఒక రంగానికే ప్రాధాన్యం ఇవ్వడం, కేవలం ఒక వర్గానికే ప్రాధాన్యం ఇవ్వడం అనేది కాకుండా అందరినీ అన్నిటినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు. తద్వారా బ్యాలెన్స్‌డ్‌గా పాలన సాగిస్తున్నారు అన్న చర్చను తెరమీదకు తీసుకువచ్చేలాగా చంద్రబాబు ప్రయత్నించారన్నది వాస్తవం.

ఇదే విషయంలో గతంలో జగన్ వ్యవహరించిన తీరు అనేక విషయాల్లో విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. ఎన్నికల్లో హామీలు ఇచ్చాం కాబట్టి నవరత్నాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తానని భీష్మించుకుని వ్యవహరించారు. ఇక రాజకీయంగా నాయకుల దూకుడును అరికట్టడంలోను, అంతర్గత కమ్ములాటలను సరిదిద్దడంలోనూ జగన్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో జగన్ పాలన అంటే బటన్ పాలన మాటను సుస్థిరం చేసుకున్నారు. దీనివల్ల మేధావి వర్గాలు సహా మధ్యతరగతి వర్గాలు కూడా జగన్‌కు దూరమయ్యాయి. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నవారు అన్ని వర్గాలను తమకు అనుకూలంగా మలుచుకునేలాగా వ్యవహరించాలి.

ఏకపక్షంగా వ్యవహరించకుండా అందరినీ కలుపుకొని పోయేలాగా వ్యవహరించాలి. ఇప్పుడు చంద్రబాబు అదే పని చేస్తున్నారు. ఒకవైపు కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ, మరోవైపు సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు ఇట్లా అన్ని వైపుల నుంచి కూడా సమన్వయంతో పని చేసుకుంటూ బ్యాలెన్స్‌గా ఆయన ముందుకు సాగుతున్నారు అన్నది కనిపిస్తోంది. ఇదే చంద్రబాబుకు, జగన్‌కు మధ్య స్పష్టమైన విభజన రేఖను ఏర్పరచింది.

ప్రస్తుతం జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. తనకు ప్రధాన ప్రతిపక్షవాత దక్కలేదన్న ఆవేదనలో కూడా ఉన్నారు. ఇప్పుడైనా ఆయన బ్యాలెన్స్‌గా రాజకీయాలు చేస్తున్నారా అంటే చేయడం లేదనే విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజా సమస్యలను ఒక పక్క ప్రస్తావిస్తూ, మరోవైపు పార్టీ పరంగా నాయకుల్ని, కార్యకర్తలను ముందుకు నడిపించాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో వ్యక్తిగతంగా తనపై వస్తున్న విమర్శలు, గతంలో ఉన్న కేసులపై స్పష్టమైన విధానాన్ని ఆయన తీసుకుని ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వదిలేసి కేవలం తాడేపల్లి కార్యాలయానికి మాత్రమే పరిమితం కావడం, వీలు చూసుకుని పరామర్శలకు వెళ్లడం వంటివి పెద్దగా ఆయనకు కలిసి రావడం లేదన్నది పరిశీలకులు చెబుతున్న మాట.