అక్క‌డా `అదే` ప్ర‌శ్న‌.. చంద్ర‌బాబు ఏం చెప్పారంటే!

సింగ‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. పెట్టుబ‌డులు.. అమ‌రావ‌తి నిర్మాణంపై అక్క‌డి పారిశ్రామిక వేత్త‌ల‌కు అనేక విష‌యాలు వెల్ల‌డించారు. సోమ‌వారం రాత్రి `ఏపీ-సింగపూర్‌` బిజినెస్‌ ఫోరం, సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వ‌హించారు. దీనిలో చంద్ర‌బాబు పారిశ్రామిక వేత్త‌ల‌కు ఏపీ అభివృద్ధి, అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. ఏపీ, సింగపూర్‌ స్టార్టప్‌ ఫెస్టివల్ త్వ‌ర‌లోనే నిర్వహిస్తామని చెప్పారు. స్టార్టప్‌ల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్త‌లు స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు.

తొలుత ఆయ‌న‌.. `ఏపీ, సింగపూర్‌ బిజినెస్‌ ఫోరం` ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ రోడ్‌షోలో పాల్గొన్నారు. అనంత‌రం.. నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పారిశ్రామిక వేత్త‌ల‌ను ఉద్దేశించి 40 నిమిషాల‌కు పైగా ప్ర‌సంగించారు. అనంత‌రం.. వారి సందేహాల‌కు స‌మాధానం చెప్పారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా ఎదురవుతున్న రెండు మూడు ప్ర‌శ్న‌లు తాజాగా కూడా సీఎం చంద్ర‌బాబుకు ఎదుర‌య్యాయి. 2019-24 మ‌ధ్య రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎలాంటి అవ‌కాశాలూ రాలేదని.. ప‌లువురు వ్యాఖ్యానించారు.

మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌ని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. దీనిపై చంద్ర‌బాబు చాలా స‌మ‌గ్రంగా వివ‌రించారు. ప్ర‌స్తుతం కూట‌మి పార్టీలుగా తాము క‌లిసి ఉన్నామ‌ని.. ప్ర‌జ‌లు కూడా విశ్వాసం చూపుతున్నార‌ని.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చుతున్నామ‌ని చెప్పారు. కాబ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ప్ర‌శ్నే కాద‌న్నారు. మ‌రోసారి తామే అధికారంలోకి వ‌స్తామ‌ని.. ప్ర‌జ‌ల‌నుంచి సేక‌రించిన సంతృప్తిస్థాయి నివేదిక‌ల‌ను ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

పెట్టుబ‌డులు పెట్టేవారికి తాను హామీగాఉంటాన‌ని సీఎం చెప్పారు. ప్ర‌స్తుతం అనేక కంపెనీలు ఏపీకి వ‌స్తన్నాయ‌ని.. సుదీర్ఘ‌కాలంగా సింగ‌పూర్‌తో ఏపీకి అనుబంధం ఉంద‌ని వివ‌రించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చారు. `ఒక కుటుంబం- ఒక వ్యాపారవేత్త` విజన్ తో పారిశ్రామిక రంగాన్ని ప‌రుగులు పెట్టిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు వెల్ల‌డించారు. ముఖ్యంగా మ‌హిళ‌ల ప్రాధాన్యం పెంచుతున్నామ‌న్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పారిశ్రామిక వేత్త‌లు త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని అనుమానాలు అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు.