ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముఖ్యంగా పాల మూరులో కీలకమైన ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇలా అడ్డుకోవడం ధర్మం కాదన్నారు. “చంద్రబాబూ మీరు విజ్ఞులు.. ఇలాచేయొచ్చా?“ అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో చంద్రబాబు ప్రారంభించిన కల్వకుర్తి ప్రాజెక్టు అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్నికూడా లేవనెత్తారు.
ఈ ప్రాజెక్టులు పాలమూరు రైతులకు, ఇక్కడి ప్రజలకు అత్యంత కీలకమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వీటిని చంద్రబాబు అడ్డు కుంటున్నారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని కోరారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనివల్ల పాలమూరు ఎండిపోతుందన్నారు. అందుకే.. తాము బనకచర్లకువ్యతిరేకంగా కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేశామని రేవంత్ చెప్పారు. “చంద్రబాబు.. తన హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను కూడా ఇప్పుడు అడ్డుకుంటున్నారు. అలా చేయొద్దండీ.. అని ఆయనకు విన్నవిస్తున్నా“ అని అన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం(బనకచర్ల)తో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుదన్నారు. అందుకే.. ఈ ప్రాజెక్టును చేపట్టవద్దని తాము కోరుతున్నట్టు తెలిపారు. పాలమూరు జిల్లాను ఒకప్పుడు చంద్రబాబు కుటుంబమే దత్తత తీసుకుందని.. ఆ తర్వాత.. ఈ జిల్లాకు అన్యాయం జరిగేలా వ్యవహరించడం.. సరికాదని సూచించారు. బాధ్యతగా వ్యవహరించాలని, పాలమూరు బిడ్డలను బతకనివ్వాలని.. ఎండబెట్టే పనులు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలోనూ సాగనిచ్చేది లేదని.. అందుకే గౌరవంగా మీరే దానిని రద్దు చేయాలని కోరుతున్నానని రేవంత్ రెడ్డి ఏపీ సీఎంకు తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates